వైసీపీ ఎంఎల్ఏలనే మించిపోయాడే…ఉపయోగం ఉంటుందా ?

తాజాగా రాజోలు జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. రాపాక అంటే మొత్తం జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాపాక గెలిచిన దగ్గర నుండి జనసేన పార్టీ ఎంఎల్ఏగా కన్నా వైసీపీ సభ్యునిగా గుర్తింపు పొందటానికే ఎక్కువ అవస్తలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రాపాక అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశాడు.

జగన్ను ఈ ఎంఎల్ఏ ఏ స్ధాయిలో మోసేశాడంటే అసలు వైసీపీ ఎంఎల్ఏలు కూడా అంత ఇదిగా పొగిడుండరనే చెప్పాలి. అసెంబ్లీలో రాపాక మాట్లాడుతు తాను బతికున్నంత కాలం జగనే సీఎంగా ఉంటాడన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇచ్చిన వరం జగన్ అంటు పొగడ్తలతో ముంచెత్తారు. నిజానికి జగన్ పై ఎంఎల్ఏ పొగడ్తలకు చంద్రబాబునాయుడుకు అప్పట్లో జరిగిన భజనకు పెద్దగా తేడా లేదనిపించింది.

అసలు రాపాక పడుతున్న ఇన్ని అవస్తలకు కారణం ఏమిటంటే తనను జగన్ వైసీపీ ఎంఎల్ఏగా గుర్తించాలనే. అయితే జగన్ మాత్రం ఆపని చేయటం లేదు. జనసేన తరపున గెలిచిన రాపాక నియోజకవర్గంలో మాత్రం తాను అధికారపార్టీ ఎంఎల్ఏగానే గుర్తింపు పొందాలని తెగ అవస్తలు పడుతున్నారు. అయితే ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆ విషయం మాత్రం సాధ్యం కావటం లేదు. నియోజకవర్గంలో జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా జగన్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

రాపాక ఎంతగా పొగిడేస్తున్నా జగన్ మనసు మాత్రం ఎందుకో కరగటం లేదు. ఎందుకంటే రాజోలులో వైసీపీ తరపున ముగ్గురు నేతలు గట్టిగానే జనాల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కాదని తననే వైసీపీ ఎంఎల్ఏగా జగన్ ప్రకటించాలన్నది రాపాక తాపత్రయం. అయితే జగన్ మాత్రం ఆపని చేయటం లేదు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను తనపార్టీలోని నేతల ద్వారానే చేయిస్తున్నారు. మరి రాపాక ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో కూడా తెలీటం లేదు.