తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త టార్గెట్ ఏమిటో తెలుసా ?

తెలుగురాష్ట్రాల్లో బీజేపీ డేంజరస్ గేమ్ మొదలుపెట్టిందా ? అంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో ఎలాగైనా తెలుగురాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాలన్న టార్గెట్ తో ఎంతటి సాహసానికైనా రెడీ అంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు రాష్ట్రాల అధ్యక్షుల దూకుడు మంత్రం కూడా పార్టీకి బాగా కలిసి వస్తోంది. తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి చాలా దూకుడుగా వెళుతున్నారు. జనాల్లో భావోద్వేగాలు రగల్చటానికి ఎటువంటి ప్రకటనలు చేయటానికి కూడా వెనకాడటం లేదన్న విషయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో తేలిపోయింది.

ఇక ఏపిలో కూడా సోము వీర్రాజు ఇదే పద్దతిలో వెళుతున్నారు. ఎప్పుడూ చూసినా ఇటు అధికార వైసీపీ దానికంటే ఎక్కువగా అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేతలను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణాలో కాంగ్రెస్, ఏపిలో టీడీపీలను పూర్తిస్ధాయిలో దెబ్బ కొట్టాలన్నదే తాజా టార్గెట్ గా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీలైనంత మందిని ఇటు కాంగ్రెస్ అటు టీడీపీల నుండి నేతలను తీసుకోవాలని డిసైడ్ చేసుకుంది.

గ్రేటర్ ఎన్నికల్లో రాబోయే ఫలితాల తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయటానికి రెడీ అయిపోయినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలతో మొదలుపెట్టి మెల్లిగా ఇతర జిల్లాల నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ వేసిందట. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసిన కమలం నేతలు గ్రేటర్ ఎన్నికల్లో తమకు లోపాయికారీగా సహకారం అందించేట్లు ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇక ఏపి విషయానికి వస్తే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికనే డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఉపఎన్నికకు ముందుగానే లేకపోతే తర్వాత కానీ టీడీపీలోని అసంతృప్త నేతల్లో వీలైనంతమందికి కమలం కండువా కప్పాలని టార్గెట్ గా పెట్టుకున్నదట. ఉత్తరాంధ్ర నుండి తమ ప్లానును అమలు చేయాలని డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే ఈ మధ్య టీడీపీ సీనియర్ నేత గద్దెబాబూరావును పార్టీలోకి చేర్చుకున్నది. ఈయన ద్వారానే మరికొంతమందికి గాలం వేసిందట. వాళ్ళంతా బీజేపీలో చేరే విషయంలో ఊగిసలాటలో ఉన్నారు. అయితే, ఇటీవల జగన్ సర్కారు వరుస తప్పులతో టీడీపీ నేతల్లో కాన్ఫిడెన్స్ పెరగడం, లోకేష్ కూడా తాజా రాజకీయాలకు అనుగుణంగా మారుతుండటంతో సొంత పార్టీలోనే భవిష్యత్తు కనిపిస్తోందన్న నమ్మకం వారికి పెరుగుతోంది.

దీంతో బీజేపీ అనుకున్నంత వేగంగా తమ పార్టీ పట్ల టీడీపీ నేతలు ఆకర్షితులు కావడం లేదు. పైగా ఏపీ ప్రయోజనాల విషయంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ కూడా ఎవరికీ నచ్చడం లేదు. తిరుపతి ఉపఎన్నిక తర్వాత చాలామందికి ఓ క్లియర్ పిక్చర్ వస్తుందని అనుకుంటున్నారు. మరి బీజేపీ గేమ్ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.