అర్థరాత్రి వేళ మోడీకి ఫోన్ చేసిన ఆ ముఖ్యమంత్రి

అర్థరాత్రి పన్నెండు గంటలు దాటి కాసేపైంది. అలాంటివేళ.. ప్రధానమంత్రిని కాంటాక్టు చేయటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యమా? అందునా.. బీజేపీయేతర పార్టీకి చెందిన సీఎం అయితే మరింత కష్టం కదా? ఇలాంటి సందేహాలకు చెక్ చెబుతూ.. సదరు సీఎం కాంటాక్టు చేసిన వెంటనే ప్రధాని లైన్లోకి వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు.. ప్రధాని మోడీకి అర్థరాత్రి వేళ ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ఎలాంటి సాయాన్ని కోరారు? దానికి మోడీ ఎలా స్పందించారు? అన్నది చూస్తే..

ఒడిశా రాష్ట్రానికి తిరుగులేని సీఎంగా పేరున్న నవీన్ పట్నాయక్ కు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు ఆర్డర్ చేసిన కరోనా కిట్లు ముంబయి-నాసిక్ మార్గంలో చిక్కుకుపోయి ఉన్నాయి. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్కారు సొంతంగా తెప్పించుకుంటున్న కిట్లు శుక్రవారం ఉదయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. దారి మధ్యలో ఇబ్బందులు ఎదురుకావటంతో దాన్ని తెస్తున్న వాహనం నిలిచిపోయింది.

దీంతో.. అర్థరాత్రి పన్నెండుపావు సమయంలో ప్రధాని మోడీకి ఫోన్ చేశారు నవీన్ పట్నాయక్. విషయం చెప్పిన నవీన్ మాటలకు సమాధానాలు చెబుతూనే.. మధ్యలో కాస్తంత గ్యాప్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటల్ని పట్టనట్లుగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి.. యోగక్షేమాల గురించి వివరాలు అడగటం మొదలెట్టిన మోడీ తీరుతో నవీన్ పట్నాయక్ కు ఒక పట్టాన అర్థం కాలేదట.

తానంత ఆందోళనలో ఫోన్ చేస్తే.. దాని గురించి సమాధానం చెప్పకుండా యోగక్షేమాలు అడగటం ఏమిటన్న చిరాకుకు గురయ్యారు నవీన్ పట్నాయక్. దీంతో.. తనలోని అసహనాన్ని దాచి పెట్టలేక.. మోడీజీ నేను బాగున్నాను. ఈ సమయంలో మీకు ఫోన్ చేయటానికి కారణం మాకు రావాల్సిన కిట్లు అర్జెంట్ గా ముంబయి నుంచి వచ్చేలా సాయం చేయాలని అన్నారు.

దానికి ప్రతిగా మోడీ సమాధానం ఇస్తూ.. ఇప్పటికే మీ కిట్లు లోడ్ అవుతున్నాయి. మీరు నిద్ర లేచేసరికి కిట్లు భువనేశ్వర్ కు వచ్చి ఉంటాయని కూల్ గా బదులిచ్చారు. దీంతో సర్ ప్రైజ్ కు గురి కావటం నవీన్ పట్నాయక్ వంతైనట్లుగా చెబుతున్నారు.

నవీన్ నుంచి ఫోన్ వచ్చినంతనే రియాక్టు అయిన మోడీ.. వెంటనే అధికారుల్నిఅలెర్టు చేయటమే కాదు.. ఫోన్ కాల్ లో ఉండగానే ఏమేం చేయాలన్న ఆర్డర్లు పాస్ అయిపోయాయట. అంతకు ముందేదీనికి సంబంధించిన సమాచారం ఉండటంతో.. జరగాల్సిన పనులు వాయువేగంతో జరిగిపోయాయట.

మోడీనే స్వయంగా రంగంలోకి రావటంతో కొద్దిరోజులుగా మూసి ఉన్న విమానశ్రయంలో రాత్రికి రాత్రే హడావుడి మొదలుకావటమే కాదు.. మోడీ చెప్పినట్లుగా శుక్రవారం ఉదయానికి భువనేశ్వర్ కు కరోనా కిట్లు చేరాయి. ఈ సమాచారం అందుకున్న ఒడిశా ముఖ్యమంత్రి ఆనందంతో ఉబ్బితబ్బుబ్బిపోయారట.

తన ముప్ఫై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి తనకెప్పుడు చూడలేదని.. ప్రధాని ఇంత వేగంగా స్పందించటం చూడలేదని నవీన్ చెప్పారట. ప్రధాని మోడీకి సీఎం నవీన్ పట్నాయక్ గురువారం అర్థరాత్రి 12.15కు ఫోన్ చేస్తే.. శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో కరోనా కిట్లు ల్యాండ్ కావటం విశేషం.