గ్రేట‌ర్‌లో టాలీవుడ్ త‌ప్పుకొంది.. రీజ‌నేంటి?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చారాన్ని దుమ్మురేపుతున్నారు. అయితే.. ఎక్క‌డ చూసినా.. రాజ‌కీయ నేత‌లే క‌నిపిస్తున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లు అనేస‌రికి.. ఒక్క నేత‌లే కాకుండా.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు విభిన్న రంగాల నుంచి అనేక మందిని రంగంలోకి దింపుతారు. అన్ని కోణాల్లోనూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డ ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. సినీ రంగం కూడా ఏదో ఒక పార్టీ త‌ర‌ఫున బ‌రిలో నిలుస్తుంది.

ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. గ‌తంలో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. కూడా చిరంజీవి కుటుంబం నుంచి ఆన్‌లైన్ ప్ర‌చారం సాగింది. ట్విట్ట‌ర్ ద్వారా కేసీఆర్‌కు అనుకూలంగా చిరు కుటుంబం ప్ర‌చారం చేసింది. అదేవిధంగా బాల‌కృష్ణ ఏకంగా టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. అలాగే.. హరికృష్ణ కుమారులు కూడా టీడీపీకి ప్ర‌చారం కోసం హైద‌రాబాద్‌ను చుట్టేశారు. ఇక‌, అల్లు వారి అబ్బాయ్ కూడా కేసీఆర్‌కు అనుకూలంగా కేటీఆర్ సూచ‌న‌ల మేర‌కు రంగంలోకిదిగారు. ఒక‌రిద్ద‌రు.. బీజేపీకి కూడాప్ర‌చారం చేసిపెట్టారు. కాంగ్రెస్ త‌రఫున కూడా కొంద‌రు రంగంలోకి దిగారు. ఇది గ‌త చ‌రిత్ర‌.

మ‌రి ఇప్పుడు మాటేంటి? అంటే.. ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. టాలీవుడ్ నుంచి ఏ ఒక్క‌రూ ప్ర‌చార ప‌ర్వంలో వేలు పెట్ట‌డం లేదు. మ‌రి ఏమైంది? ఎందుకు మౌనంగా ఉన్నారు. వీరికి పార్టీల నుంచి ఆహ్వానాలు అంద‌లేదా? అంటే.. అందాయి. కేటీఆర్ స్వ‌యంగా చిరు కుటుంబాన్ని ఆహ్వానించిన‌ట్టు టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, బీజేపీ త‌ర‌ఫున ప‌వ‌ర్ స్టార్ బ‌రిలోకి దిగుతాన‌నిప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇక‌, అల్లు కుటుంబం నుంచి బ‌న్నీ కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా రంగంలోకి దిగుతార‌ని ప్రచారం సాగింది.

దీంతో ఏం జ‌ర‌గింద‌నే వ్యాఖ్య‌లు , ప్ర‌శ్న‌లు గ్రేట‌ర్ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి. గ‌తానికి ఇప్ప‌టికి చాలా భిన్నంగా గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ లు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ దూకుడు ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలో.. ఏ పార్టీకి తాము అనుకూలంగా మారి ప్ర‌చారం చేసినా.. టాలీవుడ్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే టాలీవుడ్ దూరంగా ఉంద‌ని అంటున్నారు. మ‌రి చివ‌రి నిముషంలో ఏమైనా మార్పు జ‌రుగుతుందేమో.. చూడాలి.