పవన్‌తో మళ్లీ చేస్తున్నట్లు కన్ఫమ్ చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో హీరోయిన్లను రిపీట్ చేయడం చాలా చాలా తక్కువ. ఒక్క రేణు దేశాయ్‌ మాత్రమే కథానాయికగా పవన్‌తో రెండు సినిమాలు చేసిన ఘనత సాధించింది కొన్నేళ్ల ముందు వరకు. ఆ తర్వాత పవన్ సినిమాల్లో రెండోసారి కథానాయికగా చేసింది శ్రుతి హాసన్ మాత్రమే. తొలిసారి ‘గబ్బర్ సింగ్‌లో నటించిన శ్రుతి.. ఆ తర్వాత ‘కాటమరాయుడు’లో ఆయనతో జోడీ కట్టింది.

ఇప్పుడు పవన్‌తో మూడుసార్లు నటించిన ఏకైక కథానాయికగా ఆమె రికార్డు సృష్టించబోతోంది. ఆమె ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్‌తో జోడీ కట్టబోతున్నట్లు చాన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతినే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. త్వరలోనే పవన్ సినిమా సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు ఆమె వెల్లడించింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్’లో తాను కూడా భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రుతి చెప్పింది. జనవరి నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటానని ఆమె వెల్లడించింది. తాను చేయబోయే పాత్ర కోసం ప్రిపరేషన్లో ఉన్నట్లు ఆమె తెలిపింది. తాను ఒక హీరోతో మూడోసారి పని చేయడం ఇదే తొలిసారని శ్రుతి చెప్పింది. రవితేజ, సూర్యలతో మాత్రమే రెండేసి చిత్రాలు చేశానంది. గబ్బర్ సింగ్‌, కాటమరాయుడు చిత్రాల తర్వాత పవన్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది.

బాలీవుడ్లోనూ కొత్తగా ఒక చిత్రానికి సంతకం చేసినట్లు శ్రుతి వెల్లడించింది. ఐతే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ గత నెలలోనే పున:ప్రారంభం కాగా.. ఈ నెలలో పవన్ కూడా సెట్లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే చిత్రీకరణ పూర్తవుతుందేమో అనుకుంటే.. శ్రుతి జనవరి ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఎక్కువే ఉందన్నమాట.