బీజేపీ ‘రోహింగ్యాల’ వ్యూహం ఫ‌లించేనా?

హోరా హోరీ ర్యాలీలు.. పార్టీల స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు.. మేనిఫెస్టోల హామీల మ‌ధ్య గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం హోరెత్తుతోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌ట్టు జార‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో అధికార టీఆర్ ఎస్‌, ఎట్టిప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కి..గ్రేట‌ర్‌ను చేజిక్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా బీజేపీలు ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రికి ఎక్క‌డ ప‌ట్టుందో.. అక్క‌డ బ‌ల‌మైన ప్ర‌చారం చేస్తున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ పాత‌బ‌స్తీపై క‌న్నేసింది. ఇక్క‌డ మ‌జ్లిస్ పార్టీ దూకుడు ఎక్కువ‌. ముస్లిం సామాజిక వ‌ర్గం బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఎంఐఎంకు అనుకూలంగా ఉంది.

అయితే.. ఎంఐఎంను టార్గెట్ చేసేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా ఓ కీల‌క అంశాన్ని ఎంచుకుంది. హైద‌రాబాద్ అభివృద్ది క‌న్నా కూడా ఎంఐఎం సోద‌రులు అస‌దుద్దీన్ ఒవైసీ, అక్బ‌రుద్దీన్ ఒవైసీల‌కు రోహింగ్యా ముస్లింల‌పై ఉన్న శ్ర‌ద్ధ హైద‌రాబాద్ అభివృద్ది పై లేద‌ని కామెంట్లు కుమ్మ‌రిస్తోంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీలు ఎంఐఎంపై విమ‌ర్శ‌లు చేస్తున్నా.. అనూహ్యంగా రోహింగ్యా ముస్లింల అంశాన్ని బీజేపీ బుజాన వేసుకుని మాట్లాడ‌డం… ఎంఐఎంను నిశితంగా విమ‌ర్శించ‌డం.. రాజ‌కీయంగా ఆస‌క్తిరేపుతోంది. బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఒవైసీ సోద‌రులే ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

హైద‌రాబాద్ అభివృద్ది క‌న్నా ఒవైసీ సోద‌రుల‌కు రోహింగ్యా ముస్లింల‌ను హైద‌రాబాద్ కు తీసుకురావ‌డ‌మే ముఖ్య‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. విభ‌జ‌న వాదం-ఉగ్ర‌వాదం త‌ప్ప ఒవైసీ నోటి నుంచి మంచి మాట‌లే రావంటూ విరుచుకుప‌డ్డారు. పాత‌బ‌స్తీలో ఇన్ని ద‌శాబ్దాలుగా ఉన్నా.. ఎప్పుడైనా అభివృద్ది చేశారా? అంటూ నిల‌దీశారు. కాగా, రోహింగ్యా ముస్లింల విష‌యాన్ని బీజేపీ ఎందుకు పాచిక‌గా వాడుకుంద‌నేది కీల‌క అంశం. రోహింగ్యా ముస్లింల‌పై అరాచ‌క వాదులు అనే ముద్ర ఉంది. మ‌న‌దేశంలోని ముస్లింలు వారిని దూరం పెడ‌తార‌నే ప్ర‌చారం కూడా ఉంది. గ‌తంలో మ‌య‌న్మార్‌లో జ‌రిగిన అనేక అత్యాచారాలు, హింసాకాండ‌లో రోహింగ్యా ముస్లింల పాత్ర ఉంద‌ని తేల‌డంతో ఆ దేశం నుంచి వారిని పంపేశారు.

ఈ క్ర‌మంలో మ‌న దేశ స‌రిహ‌ద్దుల్లోకి కూడా వారు వ‌చ్చారు. అయితే.. భార‌త్ వారిని అడ్డుకుంది. అయితే.. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో ఎంఐఎం రాజ‌కీయంగా వాడుకుంది. రోహింగ్యాలకు మ‌న‌దేశంలో ఆశ్ర‌యం క‌ల్పించాలంటూ.. ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ పార్ల‌మెంటులోనే వాదించారు. అయితే.. దీనికి యూపీ, పంజాబ్ స‌హా కొన్ని రాష్ట్రాల ముస్లింలు అడ్డుకున్నారు. వారు రావ‌డం వ‌ల్ల మ‌న దేశంలోని ముస్లింల‌పై మ‌ర‌క‌లు అంటుకుంటాయంటూ.. వారు పేర్కొన్నారు. మొత్తంగా రోహింగ్యా ముస్లింలు అంటే.. అరాచక శ‌క్తులుగా బీజేపీ భావించ‌డం.. ఇదే ప్ర‌చారంలో ఉండ‌డంతో ఇప్పుడు ఇదే అంశాన్ని రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.