ఒత్తిడికి తలొంచిన ట్రంప్

మొత్తానికి అగ్రరాజ్యంలో అనిశ్చితికి తెరపడినట్లే ఉంది. ఓటమిని అంగీకరించకపోయినా అధికార మార్పిడికి మాత్రం ఒప్పుకున్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గోల చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో డెమక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ స్పష్టమైన విజయం సాధించినా ట్రంప్ అంగీకరించలేదు. కోర్టుల్లో కేసులు వేయించారు. పోలింగ్ ప్రక్రియను ఆమోదించనంటూ కోర్టుల్లో కేసులు వేశారు.

ఎన్నికల్లో ఓడిపోగానే అధికార మార్పిడికి ట్రంప్ అంగీకరించి ఉంటే చాలా హుందాగా ఉండేది వ్యవహారం. అలాకాదని నానా గోల చేశారు. దాంతో యావత్ ప్రపంచ దేశాల ముందు అమెరికా నవ్వుల పాలైపోయింది. ఎన్ని దేశాలు చెప్పినా అధ్యక్షునిగా తప్పుకోవటానికి ట్రంప్ అంగీకరించలేదు. చివరకు కుటుంబసభ్యులు చెప్పినా కుదరదు పొమ్మన్నారు. తన ఓటమిని అంగీకరించే ప్రశక్తే లేదన్నారు. బైడెన్ గెలుపు ఇల్లీగలంటూ వితండ వాదానికి దిగారు.

చివరకు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఉన్నతాధికారులు ఎంత చెప్పినా ట్రంప్ పట్టించుకోలేదు. పైగా అనేక అంశాలపై ప్రెసిడెన్సియల్ ఉత్తర్వులు ఇచ్చేయటం మొదలుపెట్టేశారు. ట్రంప్ జారీ చేస్తున్న ఆదేశాలను అమలు చేయాలో వద్దో కూడా ఉన్నతాధికారులకు అర్ధంకాని పరిస్ధితి అమెరికాలో మొదలైపోయింది. దాంతో అమెరికాలో గందరగోళం మొదలైపోయింది. తాను కోర్టుల్లో వేసిన కేసులు తేలేంత వరకు వైట్ హౌస్ ను వదిలేదంటూ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికాలో ప్రకంపనలు రేపింది.

ఏమి చేయాలో తెలీక దిక్కులు చూస్తున్న ఉన్నతాధికారులకు చివరకు ట్రంపే చల్లని కబురు చెప్పారు. తాను ఓటమిని అంగీకరించకపోయినా అధికార మార్పిడికి మాత్రం అంగీకరిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులను పిలిచి ట్రంప్ ఈమాట చెప్పటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల పుణ్యమా అని అమెరికా ప్రపంచం ముందు పరువు పోగొట్టుకున్నది. దాని మీద ట్రంపు చేసిన గొడవతో నవ్వుల పాలైంది. అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసే సమయం దగ్గర పడే కొద్దీ ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అయితే చివరి నిముషంలో ఏమనుకున్నారో ఏమో ట్రంపే అందరినీ పిలిచి అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయమని చెప్పటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.