హీరోలు జంకుతుంటే హీరోయిన్‍ దూకుతోంది

థియేటర్లు తెరుచుకోమని పర్మిషన్‍ ఏనాడో వచ్చేసినా కానీ థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలు ఇంకా ఓటిటి ప్లాట్‍ఫామ్‍లనే నమ్ముకుంటున్నారు. బడా హీరోల సినిమాలు కూడా విడుదల కాకుండా వాయిదా పడుతూనే వున్నాయి. ఏదైనా పెద్ద సినిమా రిలీజ్‍ అయితే తప్ప పరిస్థితిని అంచనా వేయలేమని భావిస్తోంటే ముందుగా ఆ ధైర్యం చేసే వాళ్లే ఎవరూ కనిపించడం లేదు. హీరోలే వెనకాడుతోన్న టైమ్‍లో హీరోయిన్‍ ప్రధాన సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ చిత్రాన్ని డిసెంబరు 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

విశేషం ఏమిటంటే అదే రోజున అమెజాన్‍లో దుర్గామతి అనే మరో హీరోయిన్‍ ప్రధాన సినిమా విడుదలవుతోంది. తెలుగులో అనుష్క నటించిన భాగమతికి రీమేక్‍ అయిన ఈ చిత్రంలో భూమి పేడ్నేకర్‍ హీరోయిన్‍గా నటించింది. మరి కియారా చిత్రం చూడ్డానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో తరలి వస్తారనేది తెలియదు. యాభై శాతం సీట్లు అమ్మకంతో బిజినెస్‍ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ చిత్రం కొంతవరకు ఉపకరిస్తుంది.