వాళ్లిద్దరూ బతిమాలినా జనం నమ్మడం లేదా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది. మామూలుగా ఏ ఎన్నికల్లో అయినా ఏ పార్టీ అయినా చేసేదేమంటే తమ బలం గురించి చెప్పుకుంటునే ప్రత్యర్ధి పార్టీల్లోని మైనస్ పాయింట్లను ఎత్తి చూపుతుంటుంది. కానీ జీహెచ్ఎంసి ఎన్నికల్లో మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ మైనస్ పాయింట్లను ఎత్తి చూపటంలోనే బీజేపీ చాలా బిజీగా గడిపేస్తోంది. కమలం పార్టీ నేతలు ఏ డివిజన్లో ప్రచారం చేస్తున్నా, ఏ స్ధాయి నేతలు ప్రచారంలో ఉన్నా ముందుగా టార్గెట్ చేస్తున్నది మాత్రం టీఆర్ఎస్-ఎంఐఎం మైత్రినే.

టీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలు రెండూ ఒకటేనని చెబుతునే ఎంఐఎంకు వేసే ప్రతి ఓటు టీఆర్ఎస్ కు వేసినట్లే అనే విషయాన్ని బాగా హైలైట్ చేస్తోంది. రెండు పార్టీలకు ఓట్లు వేయద్దని గట్టిగా ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రచారం దెబ్బకు పై రెండు పార్టీలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయాయి. దాంతో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నేతలు తమ ప్రచారంలో డిఫెన్సులో పడిపోతున్నారు. ఇదే సందర్భంలో తమ రెండు పార్టీల మధ్య పొత్తులు కానీ లేకపోతే అవగాహన కానీ లేదంటే లేదని మొత్తుకుంటున్నారు.

టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపైనర్ హోదాలో ప్రచారంలో బిజీగా ఉన్న కేటీయార్ కూడా తమకు ఎంఐఎంతో సంబంధం లేదని, పొత్తు లేదని పదే పదే చెబుతున్నారు. ఇక కేసీయార్ కూడా ఇదే మాట చెప్పారు. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ తమకు టీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదంటూ పదే పదే చెప్పారు. తమకు బలం ఉందని అనుకున్న 52 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రధాన ప్రత్యర్ధి టీఆర్ఎస్సే అంటూ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే తమ పార్టీల మధ్య సంబంధాలు లేవని, పొత్తులు లేవని వీళ్ళెంత ప్రకటించుకున్నా , మొత్తుకున్నా జనాలు ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే జీహెచ్ఎంసి ఎన్నికలపై అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో కేసీయార్ నిర్వహించిన సమావేశంలో అసదుద్దీన్ కూడా పార్టిసిపేట్ చేశారు. టీఆర్ఎస్ తో ఎటువంటి సంబంధం లేకపోతే, పొత్తులు లేకపోతే కేసీయార్ మీటింగుకు అసదుద్దీన్ ఎందుకు హాజరయ్యారంటు కమలం నేతలు మండిపడుతున్నారు.

ఏదేమైనా గ్రేటర్ పరిధిలోని హిందు ఓట్లపై కన్నేసిన బీజేపీ టీఆర్ఎస్-ఎంఐఎం ఒకటే అనే ముద్ర వేయటంలో ఇప్పటికైతే సక్సెస్ అయినట్లే అనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో పనిచేసినట్లు ప్రత్యేక తెలంగాణా వాదం ఇపుడు పనిచేయటం లేదని సమాచారం. ఇదే సందర్భంలో గడచిన ఆరేళ్ళల్లో తాము చేసిన అభివృద్దిని ప్రొజెక్టు చేసుకోవటంలో కూడా టీఆర్ఎస్ అంత సక్సెస్ అవుతున్నట్లు లేదు. ప్రచారం మొత్తం బీజేపీ ఆరోపణలకు ప్రత్యారోపణలు చేయటంలోను, డిఫెన్సులోనే సమయం గడచిపోతోంది. ఇక కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల ప్రచారాన్ని జనాలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. వ్యవహారం మొత్తం టీఆర్ఎస్-బీజేపీల చుట్టే తిరుగుతోంది. మరి రిజల్టు ఎలాగుంటుందో చూడాల్సిందే.