బండిని కాదని కేంద్రమంత్రే చక్రం తిప్పాడా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో ఏమి జరుగుతోందో రెండు పార్టీల నేతల్లోను అర్ధం కావటం లేదు. రెండు పార్టీలంటే బీజేపీ, జనసేన లేండి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ అసలు జనసేనతో తమకు పొత్తే లేదు పొమ్మన్నారు. పొత్తు అంటే అర్ధం గ్రేటర్ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో బీజేపీ+జనసేన అభ్యర్ధులు కలిసి పోటీ చేయటమని అర్ధం. ఎప్పుడైతే జనసేనతో పొత్తు లేదని బండి ప్రకటించేశారో అప్పుడో అర్ధమైపోయింది పవన్ కున్న సీనేంటో.

అయితే సీన్ కట్ చేస్తే ఇపుడు బీజేపీ, జనసేన ఒకటైపోయాయి. పొత్తులేదు ఏమీ లేదు పొమ్మన్న బీజేపీ, జనసేనలు ఇపుడు ఎలా ఒకటయ్యాయి ? ఎలాగంటే తెరవెనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చక్రంతిప్పారట. బండి సంజయ్ ను కాదని మరీ కిషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను వెంట పెట్టుకుని మరీ పవన్ తో పొత్తు చర్చలు జరిపి ఫైనల్ చేసేశారు. కిషన్ రెడ్డి కుదుర్చుకున్న పొత్తు కూడా పాము చావకుండా కర్ర విరక్కుండా అన్న సామెతలా అయ్యిందట. అంటే పొత్తు కుదరటం వల్ల బండి ఓడినట్లూ కాదు, పవన్ గెలిచినట్లూ కాదు.

ఎలాగంటే పొత్తు కుదిరింది కానీ మొత్తం 150 డివిజన్లలోను బీజేపీనే పోటీ చేస్తుంది. జనసేన పోటీ నుండి విత్ డ్రా అయిపోయింది. ఇదే సమయంలో పవన్ బీజేపీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేస్తారు. బండి జనసేనతో పొత్తు ఎందుకు లేదన్నారంటే అప్పటికే అన్నీ డివిజన్లలో అభ్యర్ధులు ఖరారైపోయారు కాబట్టి. పొత్తుల్లో భాగంగా కొన్ని డివిజన్లలో మార్పులు చేస్తే గొడవైపోతుందని బండి అనుకున్నారు. అందుకనే జనసేనతో పొత్తు లేదని తేల్చేశారు. మరి తర్వాత ఏమైందో ఏమో మరుసటి రోజు కిషన్ అండ్ కో పవన్ తో పొత్తు కుదిర్చేసుకున్నారు.

ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే జనసేనతో పొత్తు చర్చల్లో బండి పాల్గొనలేదని. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకోవటం బండికి ఏమాత్రం ఇష్టంలేదట. అందుకనే జీహెచ్ఎంసి ఎన్నికల్లోనే కాదు తెలంగాణాలో ఏ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తుండదని బహిరంగంగానే ప్రకటించేశారు. కానీ పవన్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అగత్యం వచ్చింది. అందుకనే తన మాటకు కట్టుబడే బండి పొత్తు చర్చల్లో పాల్గొనలేదని సమాచారం. అంటే బండికి ఇష్టం లేకుండానే కిషన్ జనసేనతో పొత్తు కుదుర్చుకున్న విషయం అర్ధమైపోతోంది.

సరే ఇదంతా ఓకేనే కానీ అసలు గ్రేటర్ పరిధిలో జనసేనకు ఉన్న బలమెంత ? ఏమో ఎవరికీ తెలీదు. ఎందుకంటే తెలంగాణాలో కానీ గ్రేటర్ పరిధిలో కానీ జనసేన ఇంతవరకు యాక్టివ్ గా ఒక్క కార్యక్రమం కూడా జరిపిందే లేదు. కేసీయార్ తో వైరం ఇష్టంలేని పవన్ తెలంగాణా రాజకీయాలకు ఇంతకాలం దూరంగానే ఉంటున్నారు. అలాంటిది ఒక్కసారిగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ అని ప్రకటిస్తే అందరు హాస్చర్యపోయారు. అసలు ఉందో లేదో కూడా తెలీని జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం అంటే భలే విచిత్రంగా ఉందంటున్నారు జనాలు. చూద్దాం రెండు పార్టీలు కలిస్తే గ్రేటర్ ఎన్నికల్లో అద్భతాలు ఏమన్నా జరుగుతుందేమో.