ఐపీఎల్ స్టార్.. ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు

గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చేవాళ్లు అక్రమంగా బంగారం, లగ్జరీ వస్తువులను ట్యాక్స్ కట్టకుండా తీసుకురావడం,. ఎయిర్ పోర్టులో దొరికిపోవడం మామూలే. సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు సైతం ఇలా బుక్ అవుతుంటారు. తాజాగా యూఏఈలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ పదమూడో సీజన్ ముగించుకుని ఇండియాకు వచ్చిన ముంబయి ఇండయిన్స్ జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఇలాగే అధికారులకు దొరికిపోయాడు.

ఐపీఎల్లో విజేతగా నిలిచిన ముంబయి జట్టుతో కలిసి అతను ముంబయి ఎయిర్ పోర్టులో దిగగా.. అతడికి కస్టమ్స్ అధికారులు షాకిచ్చారు. కృనాల్, అతడి భార్యకు సంబంధించిన బ్యాగుల్లో నాలుగు లగ్జరీ వాచీలతో పాటు పరిమితికి మించి బంగారం కూడా దొరికింది. ఇవి అనధికారికంగా, ట్యాక్స్ చెల్లించకుండా తెస్తున్నవి అధికారులు గుర్తించారు.

కృనాల్ దగ్గరున్న వాచీల్లో రెండు ఒక్కోటి రూ.75 లక్షల విలువ చేసేదట. వాటి గురించి సమాచారం అడిగితే కృనాల్ నీళ్లు నమిలాడట. కృనాల్, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న అధికారులు దాదాపు నాలుగ్గంటలు విచారించి తర్వాత పంపేశారట. మరి వాచీలు, బంగారాన్ని ఏం చేశారు.. కేసు బుక్ చేశారా లేదా అన్నది తెలియదు. కృనాల్‌తో పాటు అతడి తమ్ముడు హార్దిక్‌లకు లగ్జరీ వాచీల పిచ్చి ఉంది. ఆ మధ్య లండన్‌లో ఒక సర్జరీ చేయించుకున్న సందర్భంగా హార్దిక్ కోటి రూపాయలకు పైగా విలువైన వాచీతో కనిపించాడు.

ముంబయి జట్టులో కీలక సభ్యులైన ఈ ఇద్దరు సోదరులకు కలిపి ఏటా దాదాపు రూ.15 కోట్ల దాకా ముడుతోంది. ఐపీఎల్ ద్వారానే కెరీర్ నిర్మించుకున్న కృనాల్ బ్రదర్స్.. టీమ్ ఇండియా స్థాయికి కూడా ఎదిగారు. హార్దిక్ భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడన్న సంగతి తెలిసిందే. కృనాల్ కూడా టీ20ల్లో భారత్‌కు ప్రతినిధ్యం వహించాడు.