బొజ్జ‌ల కుటుంబం ఎక్క‌డ‌? రాజ‌కీయాల‌కు తెర‌ప‌డిన‌ట్టేనా?

ఆయ‌న వివాద ర‌హిత నేత‌. ఏంద‌బ్బాయ్! అంటూ ప్ర‌తి ఒక్క‌రినీ.. ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన నాయ‌కుడు. మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టినా.. ఎమ్మెల్యేగానే కొన‌సాగినా. ఆయ‌న ఎక్క‌డా వివాదాలు కొనితెచ్చుకోలేదు. టీడీపీలో ఎంతో సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఆది నుంచి ఒకే పార్టీ, ఒకే జెండా అనేలా ముందుకు సాగారు. ఆయ‌నే చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తికి చెందిన బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి కుటుంబం. టీడీపీ ఆవిర్భా వంలోనే ఆయ‌న పార్టీలోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 1989లో తొలిసారి ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి.. విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత .. బొజ్జ‌ల వెనుదిరిగి చూసుకోలేదు.

త‌న వ్య‌వ‌హార శైలి, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ప‌ట్ల ఓపిక‌తో వ్య‌వ‌హ‌రించే తీరు, అవినీతి లేని నాయ‌క‌త్వం.. ఆయ ‌న‌ను ముందుకు న‌డిపించాయి. ఈ క్ర‌మంలోనే ఒక్క 2004లో త‌ప్ప‌.. 2014 వ‌ర‌కు బొజ్జ‌ల విజ‌యం సాధిస్తూనే వ‌చ్చారు. గ‌తంలోనూ.. 2014లోనూ ఆయ‌న మంత్రి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా చ‌క్రం తిప్పారు. పార్టీకి, పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా విధేయుడిగా ఆయ‌న ముద్ర వేసుకున్నారు. అలిపిరిలో చంద్ర‌బాబుపై న‌క్స‌ల్స్ జ‌రిపిన దాడి స‌మ‌యంలో బొజ్జ‌ల కూడా బాబు వెంటే ఉన్నారు. ఈ క్ర‌మం లో ఆయ‌న గాయ‌ప‌డ్డారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

ఈ క్ర‌మంలోనే 2014లో మంత్రి అయిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా యాక్టివ్ పాత్ర పోషించ‌లేక పోయారు. దీంతో అనూహ్యంగా చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. దీంతో తొలిసారి బొజ్జ‌ల టీడీపీ అధినేత‌పై ఫైర‌య్యారు. అయితే, కుమారుడు సుధీర్ భ‌విత‌వ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెన‌క్కి త‌గ్గారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో సుధీర్‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. అయితే, ఆయ‌న త‌న తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌లేక పోయారు. ఎన్నిక‌ల ప్ర‌చారం నుంచే సుధీర్ వెనుక‌బ‌డ్డార‌నే వాద‌న వినిపించింది. ఇది ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగింది. దీంతో 38 వేల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో సుధీర్ ఓడిపోయారు.

స‌రే! ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటు న్నారు సుధీర్‌. దీంతో పార్టీని న‌డిపించేవారు కూడా లేక‌.. కార్యకర్తలు ఉసూరు మంటున్నారు. కేడర్‌ను పట్టించుకోవడం లేదని.. ఇలా అయితే.. ఎలా అని .. రాజ‌కీయంగా సుధీర్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు కూడా ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల కేటాయించిన పార్టీ ప‌ద‌వుల్లోనూ బొజ్జ‌ల కుటుంబానికి ప్రాధాన్యం ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి దూకుడు భారీగా ఉంది. దీంతో బొజ్జ‌ల ఫ్యామిలీపై రాజ‌కీయ కారుమ‌బ్బులు క‌మ్ముకున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.