టీడీపీ ఉత్తరాంధ్ర నేతలపై బీజేపీ కన్నేసిందా ?

అవుననే అంటున్నారు కమలంపార్టీ నేతలు. ఇందుకు ముందుగా ఉత్తరాంధ్రను వేదికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీలో సంవత్సరాల పాటు కీలకంగా ఉన్న విజయనగరం జిల్లా నేత గద్దె బాబురావును బీజేపీలో చేర్చుకోవటం ఇందులో భాగమనే అంటున్నారు. గద్దె కూడా అనేక కారణాల వల్ల చంద్రబాబునాయుడు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ విషయాన్ని కమలనాధులు గ్రహించారు. అందుకనే చురుగ్గా పావులు కదిపారు. కొందరు సీనియర్లను గద్దెతో మాట్లాడించారు. దాంతో గద్దె కూడా సానుకూలంగా స్పందించటంతో వెంటనే బీజేపీ కండువ కప్పేసుకున్నారు.

ఇదే పద్దతిలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో కూడా చర్చలు జరగుతున్నట్లు సమాచారం. గంటా టీడీపీలో ఇమడలేకపోతున్నారన్నది వాస్తవం. అధికార వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నాడు. అయితే రాజసభ ఎంపి, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి కీలక నేత విజయసాయిరెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకుంటున్నారు. వీళ్ళద్దరు అడ్డుకోకుంటే వైసీపీలోకి గంటా ఎంట్రీ ఎప్పుడో అయిపోయేదే.

ఇక మరో మాజీ ఎంఎల్ఏ మీసాల గీత కూడా ఇదే దారిలో ఉన్నట్లు సమాచారం. ఈమె కూడా చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఏ అయినా తనను పక్కనపెట్టేసి అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చినప్పటి నుండి ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయటం లేదట. దానికితోడు చంద్రబాబు ఈమధ్యనే నియమించిన పార్టీ కమిటీల్లో కూడా ఎందులోను అవకాశం ఇవ్వలేదు. దాంతో పార్టీలో నుండి ఎప్పుడెప్పుడు వచ్చేదామా అని చూస్తున్నట్లు సమాచారం. ఆమె మొదటి ప్రిఫరెన్సు వైసీపీనే అనటంలో సందేహం లేదు.

అయితే ఆమె మద్దతుదారులు మాత్రం వైసీపీకన్నా బీజేపీనే బెటర్ ఆప్షన్ అని చెబుతున్నారట. ఎందుకంటే విజయనగరం జిల్లాలో మంత్రి బొత్సా సత్యనారాయణ ధాటిని తట్టుకోవటం కష్టమంటున్నారట. అదే బీజేపీలో అయితే గట్టి నేతలు లేరు కాబట్టి ప్రాధాన్య ఉంటుందని చెప్పారట. ఇపుడు గంట అయినా, మీసాల గీత అయినా ఈ విషయంలోనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో ఎప్పటికీ ఎదిగే అవకాశం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇటువంటి పార్టీలోకి వెళ్ళి ఏమి చేస్తామనే ప్రశ్న అందరిని తొలిచేస్తోంది.

ఇదే సమయంలో టీడీపీని పక్కకునెట్టి ఆ స్ధానంలోకి బీజేపీ చేరుకోవాలనే ప్రయత్నాలను అందరు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటమే పెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి వైసీపీలో చేరలేని వాళ్ళంతా బీజేపీలో చేరటానికి సిద్ధమవుతున్నారు. దీన్నే బీజీపే అధ్యక్షుడు సోము వీర్రాజు అడ్వాంటేజిగా తీసుకుంటున్నారు. మరి ఎంతమంది టీడీపీ నేతలు కమలం కండువా కప్పుకుంటారో చూడాలి.