ఎస్సీ-ఎస్టీ కేసులు.. ఇకపై అలా చెల్లవు

దళితులకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎస్పీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండటంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. నిజంగా ఈ చట్టం అసలైన బాధితులకు ఏమేర ఉపయోగపడుతోందన్న ప్రశ్న తరచుగా తలెత్తుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ఎస్సీ, ఎస్టీలను ఉపయోగించుకుని కేసులు పెట్టించిన సందర్భాలు ఎన్నో.

అలాగే ఈ చట్టం కింద కేసులు పెట్టి కొందరు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సమాజంలో బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించాలన్న మంచి ఉద్దేశంతో తెచ్చిన ఈ చట్టాన్ని ఉపయోగించుకుని పెట్టే కేసుల్లో తప్పుడువే ఎక్కువ ఉంటున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

నాలుగు గోడల మధ్య సాక్షులెవరూ లేని చోట ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తిని అవమానించారని, బెదిరించారని చేసే ఆరోపణలను ఎస్సీ-ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి, ఓ దళిత మహిళకు ఆస్తి విషయంలో గొడవలున్నాయి. దానికి సంబంధించిన కేసు నడుస్తుండగానే.. అతను తనను కులం పేరుతో దూషించాడంటూ ఎస్సీ-ఎస్టీ చట్టం కింద ఆ మహిళ కేసు పెట్టింది. ఐతే ఆస్తి గొడవ నడుస్తుండగా.. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద కేసు పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అక్కడ అతడికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లాడు. ఈ కేసును దృష్టిలో ఉంచుకుని సర్వోన్నత న్యాయస్థానం ఈ చట్టం విషయంలో కీలక తీర్పు వెలువరించింది.

బహిరంగ ప్రదేశాల్లో వేరే వ్యక్తులు ఉన్నపుడు దూషిస్తే, వేధిస్తేనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టొచ్చని.. అలా కాకుండా నాలుగు గోడల మధ్య సాక్షులు లేనపుడు తమను దూషించారని, వేధించారని ఆ చట్టం కింద కేసులు పెడితే చెల్లవని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఈ చట్టం దుర్వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు.