కాజల్ డ్రెస్ కోసం 20 మంది.. నెల రోజులు

దశాబ్దంన్నరకు పైగా కథానాయికగా కొనసాగుతున్న ఇటు తెలుగులో, అటు తమిళంలో స్టార్ ఇమేజ్ సంపాదించిన కాజల్ అగర్వాల్.. ఉన్నట్లుండి పెళ్లి చేసేసుకుంది. తన పెళ్లి గురించి ఆమె గత నెలలోనే ప్రకటించింది. ఆ నెలలోనే పెళ్లి కూడా చేసేసుకుంది. కరోనా టైం కావడంతో సాధ్యమైంత తక్కువ మంది అతిథుల మధ్య ఈ పెళ్లి జరిగింది. ఐతే వధూవరులను ముస్తాబు చేసే విషయంలో మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేకపోయింది. ఇద్దరి స్థాయికి తగ్గట్లే భారీగా ఖర్చు పెట్టి స్పెషల్‌గా డిజైన్ చేసిన దుస్తులు ధరించారు కాజల్, గౌతమ్.

కాజల్ ధరించిన లెహంగా వెనుక చాలా కథే ఉందట. దీని గురించి సోషల్ మీడియాలో ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా పోస్ట్ చేసింది. ఎంతో ప్రేమతో ఈ లెహంగాను తయారు చేశామని.. ఫ్లోరల్ డిజైన్లో ఈ లెభంగాను ఎంబ్రాయిడరీ వర్క్ చేయించడానికి 20 మంది దాదాపు నెల రోజుల పాటు కష్టపడ్డారని ఆమె వెల్లడించింది. అంటే కాజల్ తన పెళ్లి గురించి ప్రకటన చేయడానికి ముందే ఈ లెహంగా తయారీ పని మొదలైందన్నమాట. ఈ లెహంగా ఖరీదు లక్షల్లోనే ఉంటుందని అర్థమవుతోంది.

మరోవైపు తాళి కట్టించుకునే సమయంలో కాజల్ ధరించిన ఆభరణాలు కూడా బాగా ఖరీదైనవే. వాటిని సునీతా షెకావత్ అనే డిజైనర్ స్వయంగా చేతితో తయారు చేసింది. ముంబయిలోని తాజ్ హోటల్లో పరిమితమైన అతిథుల మధ్యే పెళ్లి ఘనంగా చేసుకుంది కాజల్, గౌతమ్ జంట. ఇక పెళ్లి తర్వాతి రోజు ఉదయం గౌతమ్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. నిద్ర లేచి లేజీగా కనిపిస్తున్న కాజల్ ఫొటో పెట్టి.. మిసెస్ కిచ్లుగా నిద్ర లేచిన కాజల్ అంటూ వ్యాఖ్య జోడించాడు.