తుమ్మ‌ల హ‌వాకు బ్రేకులు.. స్వ‌యంకృత‌మా.. సౌజ‌న్య శాప‌మా?

ఒక ఏడాది మంత్రిగా చేసిన నాయ‌కులే.. రాజ‌కీయాల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్న రోజులు. అలాంటిది ఏకంగా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల వ‌ద్ద‌.. రెండు భిన్న‌మైన పార్టీల్లో ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 సంవ‌త్స‌రాలు.. మంత్రిగా చ‌క్రం తిప్పిన నేత హ‌వా ఎలా ఉండాలి? భ‌విష్య‌తు ఎలా ఉంటుంద‌ని అనుకుంటారు? తిరుగులేద‌ని.. ఆయ‌న మాట‌కు వెన‌క‌నేదే.. ఉండ‌ద‌ని అనుకుంటారు. కానీ, అలాంటి నాయ‌కుడు.. వ్యూహ‌క‌ర్త‌, మేధావి.. ఇప్పుడు ఎక్క‌డో ప‌ల్లెటూరులో త‌న సొంత పొలంలో వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. ఇది నిజం! ఎప్పుడో జ‌రిగింది కాదు.. ఇప్పుడు జ‌రుగుతున్న‌దే!

ఆయ‌నేమీ.. వ్యూహాలు ఉడిగిపోయిన నాయ‌కుడేమీ కాదు.. నేటి త‌రానికి చెంద‌ని వ్య‌క్తీ కాదు.. నాటి నుంచి నేటి త‌రం వర‌కు చ‌క్రం తిప్పిన నాయ‌కుడే.. ఆయ‌నే ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. టీడీపీతో ప్రారంభ‌మైన తుమ్మ‌ల రాజ‌కీయ ప్ర‌స్థానం.. తిరుగులేని నాయ‌కుడిగా సాగింది. 2014 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసేవ‌ర‌కు ఆయ‌న టీడీపీ మ‌ద్ద‌తుదారుగానే ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబుకు అత్యంత విధేయులుగా ఉన్న ఖ‌మ్మ నేత‌ల్లో తొలి వ‌ర‌సులో ఉన్న నాయ‌కుడిగా తుమ్మ‌ల గుర్తింపు పొందారు. బాబు హ‌యాంలో మంత్రిగా చ‌క్రం తిప్పారు.

అయితే, టీడీపీ ప్ర‌భావం త‌గ్గ‌డం.. త‌న ఓట‌మి.. వెరసి.. ఆయ‌న‌ను టీఆర్ఎస్ వైపు అడుగులు వేయించా రు. ఆయ‌న టీఆర్ ఎస్‌లోకి అడుగులు వేయ‌డంతోనే కేసీఆర్ ఆయ‌న‌ను ఎమ్మెల్సీని చేయ‌డంతోపాటు.. మంత్రిగా కూడా అవ‌కాశం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే పాలేరుకు ఉప ఎన్నిక వ‌చ్చిన‌ప్పుడు.. ప‌ట్టుబ‌ట్టి..అక్క‌డ నుంచి తుమ్మ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, కింది స్థాయి నేత‌ల‌ను క‌లుపుకొని పోలేక‌పోవ‌డం.. హుందా పేరుతో కేడ‌ర్‌కు దూరం కావ‌డం.. తుమ్మ‌ల‌కు శాపంగా ప‌రిణమించాయి.

అదేస‌మ‌యంలో ఖ‌మ్మం రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు వేర్వేరు పార్టీల్లో ఉన్న అజ‌య్‌కుమార్‌, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, నామా నాగేశ్వ‌ర‌రావు స‌హా.. అనేక మంది కీల‌క నేత‌లు కారెక్కారు. వీరి జోరు, వ్యూహాల ముందు.. తుమ్మ‌ల వెనుక‌బ‌డ్డారు. ఇక‌, 2018 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పాలేరు నుంచి పోటీ చేసినా.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలులు వీచినా.. తుమ్మ‌ల మాత్రం ఓడిపోయారు. ఇక్క‌డ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థి కందాల ఉపేంద‌ర్‌రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తుమ్మ‌ల రాజ‌కీయాల‌పై మ‌రింత‌గా మేఘాలు ముసురుకున్నాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న ఒక మాట చెప్పేవారు.. న‌న్ను గెలిపిస్తే.. అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే.. మా వూరు పోయి.. వ్య‌వ‌సాయం చేసుకుంటాఅని! ఇప్పుడు ఆయ‌న అదేపని చేసుకుంటున్నారు. జిల్లాలో టీఆర్ఎస్‌కు నేత‌లు పెరిగిపోవ‌డంతో కేసీఆర్ కూడా తుమ్మ‌ల‌వైపు దృష్టి పెట్ట‌లేక పోతున్నారు. దీంతో తుమ్మ‌ల ఇప్పుడు.. త‌న‌సొంత గ్రామం ద‌మ్మ‌పేట మండ‌లం గంగుల‌పేటలో వ్య‌వ‌సాయం చేసుకుం టున్నారు. ఏదో అడ‌పా ద‌డ‌పా నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్నా.. పెద్ద‌గా యాక్టివ్‌గా మాత్రం ఉండ‌డం లేదు. అయితే, ఇప్పుడు ఓ చిన్న ఆశాదీపం ఒక‌టి వెలుగు చూసింది.. త్వ‌ర‌లోనే ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుంద‌ని, దీనికి తుమ్మ‌ల పేరును కేసీఆర్ ప‌రిశీలిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇది నిజ‌మైతే.. తుమ్మ‌ల‌కు మ‌ళ్లీ రాజ‌కీయ భ‌విత‌వ్యం ఉన్న‌ట్టు.. లేక‌పోతే.. ఇక‌, ఆయ‌న రాజ‌కీయాల‌కు శుభం కార్డు ప‌డిన‌ట్టే.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.