అంతకంతకూ వెనుకబడిపోతున్న ట్రంప్.. తాజా సర్వే ఏం చెప్పిందంటే?

ప్రపంచ వ్యాప్తంగా అందరిని చూపు అమెరికా అధ్యక్ష ఎన్నికల మీదనే. చరిత్రలో మరెప్పుడు లేనంతగా భారీ ఖర్చుతో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల పోటీ తీవ్రంగా సాగుతోంది. అయితే.. ఈ పోరులో తుది విజయం ఎవరిది? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు వెల్లడైన అంచనాల ప్రకారం ట్రంప్ కంటే.. జోబైడెన్ కాస్తంత అధిక్యతలో ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించే సర్వే తన వివరాల్ని వెల్లడించింది. ట్రంప్ తో పోలిస్తే జోబైడెన్ కే ఎక్కువ విజయవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ద హిల్ పేర్కొన్న వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ కంటే బైడెన్ 12 పాయింట్లు అధిక్యతలో ఉన్నట్లుగా తేల్చారు.

ఇదిలా ఉండగా.. ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా తేల్చింది సీఎన్ఎన్ మీడియా సంస్థ. ట్రంప్ వైపు 42 శాతం అమెరికన్లు మొగ్గు చూపగా.. బైడెన్ వైపు 54 శాతం మద్దతు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హిల్లరీ కంటే కూడా ఈసారి బైడెన్ కు వస్తున్న అధిక్యతే ఎక్కువని చెబుతున్నారు. ఏడాదినుంచి సీఎన్ఎన్ చేపట్టిన సర్వేలన్నీ బైడెన్ కు అనుకూలంగా ఉండటాన్ని మర్చిపోకూడదు.

సీఎన్ఎన్ చేపట్టిన సర్వేలోని కీలకాంశాలు చూస్తే.. గత ఎన్నికల్లో ట్రంప్ పక్షాన.. రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చే పలువురు తాజా ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపటం గమనార్హం. మహిళా ఓటర్లతో పాటు అమెరికాలోని నల్లజాతీయులు గంప గుత్తగా బైడెన్ కు ఓటు వేసేందుకు ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. రిపబ్లికన్లకు పెట్టని కోటలా ఉండే పెద్ద వయస్కులు ఈసారి కూడా బైడెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఓటర్లలో ఒక్క శ్వేతజాతీయ పురుషులు మాత్రమే ట్రంప్ కు అండగా నిలిచినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ అంచనాలన్ని నిజమై.. ట్రంప్ కు ఓటమి.. బైడెన్ కు గెలుపు పక్కానా అన్నది తేలాలంటే.. తుది ఫలితం వచ్చే వరకూ వెయిట్ చేయక తప్పదు.