రాహుల్ కి మంచి అస్త్రాలిస్తున్న మోడీ

మొదటి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. కాకపోతే రాజకీయ నేతల ప్రసంగాలలకు, ఆరోపణలు, విమర్శలకు మామూలు అంశాలు సరిపోవన్నట్లుగా సైన్యాన్ని లాగుతుండటమే విచిత్రంగా ఉంది. ఆమధ్య భారత భూభాగంలోకి చైనా సైన్యాలు చొచ్చుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో గాల్వాన్ లోయలో జరిగిన గొడవలో భారత్ సైనికుడు 20 మంది చనిపోయారు. ఆ విషయమై తాజాగా ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ కీలక నేత రాహూల్ గాంధి ప్రధానమంత్రి నరేంద్రమోడిపై విరుచుకుపడ్డారు.

ఆమధ్య మోడి మాట్లాడుతూ మన భూభాగంలోకి చైనా సైన్యం అంగుళం కూడా చొరబడలేదంటు చేసిన ప్రకటనను రాహూల్ ప్రస్తావించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు మన సైన్యాన్ని అవమానించటమే అంటూ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. డ్రాగన్ సైన్యం మన భూభాగంలోకి చొరబడకపోతే మరి గొడవ ఎక్కడ జరిగింది ? మన సైనికులు 20 మంది ఎందుకు చనిపోయారు ? అంటూ రాహూల్ ప్రధానిని నిలదీశారు. రేయనకా, పగలనకా దేశానికి కాపలా కాస్తున్న ఆత్మస్ధైర్యం దెబ్బతినేలా మోడి వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.

మన భూభాగంలోకి చైనా సైన్యం 1200 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చినట్లు రాహూల్ తెలిపారు. ఒకవేళ చైనా సైన్యం చొరబాట్లకు దిగలేదంటే బహుశా ప్రధాని వాళ్ళని రమ్మని ఆహ్వానించినట్లుంది అంటూ ఎద్దేవా చేశారు. సైన్యం గురించి మాట్లాడటం మానేసి ముందు బీహార్ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మోడి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ సూటిగా ప్రశ్నించారు. రైతులు, కార్మికులు, సైనికులు, చిన్న వ్యాపారుల కోసమే పనిచేస్తానన్నారు. వాళ్ళ ముందు తలొంచుకుంటానని కూడా రాహూల్ చెప్పారు. కానీ ప్రధాని మాత్రం కేవలం అంబానీ, అదానీల కోసమే పనిచేస్తున్నట్లు రాహూల్ చురకలంటించారు. మొత్తం మీద బీహార్ ఎన్నికల వేడి మాత్రం పెరిగిపోతోంది.