నిర్మాతలతో శంకర్ తాడో పేడో

దక్షిణాది సినిమాను గొప్ప మలుపు తిప్పిన దర్శకుడు శంకర్. ‘జెంటిల్‌మ్యాన్’తో మొదలుపెడితే ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన శంకర్.. రెండేళ్ల కిందట ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘2.0’తో పలకరించాడు. దీని తర్వాత ఆయన మరో మెగా మూవీని లైన్లో పెట్టారు. అదే.. ఇండియన్-2. రెండు దశాబ్దాల కిందట వచ్చిన మెగా బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇండియన్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. కమల్ హాసనే ఇందులోనూ కథానాయకుడు.

ఐతే ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. మొదట కమల్‌కు మేకప్ పడనందుకు, ఆ తర్వాత ఆయన లోక్‌సభ ఎన్నికల్లో బిజీ అయినందుకు.. ఆపై సెట్లో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఈ సినిమాకు బ్రేకులు పడ్డాయి. చివరికి కరోనా వచ్చి ఈ సినిమాకు ఇంకా పెద్ద బ్రేక్ వేసింది.

ఐతే కరోనా ప్రభావం కొంచెం తగ్గాక అన్ని భాషల్లోనూ చిత్రీకరణలు పున:ప్రారంభం అయినప్పటికీ ‘ఇండియన్-2’ మాత్రం పట్టాలెక్కట్లేదు. ఇందుకు కారణాలేంటేన్నది అర్థం కావడం లేదు. సమస్య నిర్మాతల దగ్గరే ఉందని కోలీవుడ్ మీడియా అంటోంది. వాళ్ల తీరుతో విసిగిపోయిన శంకర్.. తాజాగా ఒక ఘాటు లేఖ రాసినట్లు తెలిసింది. సినిమాను పున:ప్రారంభించే ప్రణాళికలేమైనా ఉన్నాయా లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించాడట.

సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ మొదలుపెట్టని పక్షంలో తాను వేరే సినిమాను మొదలుపెట్టుకుంటానని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. వచ్చే మూణ్నాలుగు నెలల్లో ‘ఇండియన్-2’ పూర్తి చేయని పక్షంలో ఆ తర్వాత చాలా ఆలస్యమవుతుంది. కమల్ అసెంబ్లీ ఎన్నికల పనుల్లో బిజీ అయిపోతారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-2’ సంగతి నిర్మాతల దగ్గర తేల్చుకోవాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం.