పవన్ కళ్యాణ్‌కు డెడ్ లైన్ పెట్టిన క్రిష్

కరోనా విరామం తర్వాత చాలామంది హీరోలు మళ్లీ షూటింగ్‌లకు వచ్చేశారు. కానీ మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా చిత్రీకరణల్లో పాల్గొనలేదు. షూటింగ్‌లకు అనుమతులివ్వాలని మూణ్నాలుగు నెలల ముందే రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల్ని కలిసిన చిరు.. ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడన్నది అర్థం కావడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం షూటింగ్‌ పున:ప్రారంభించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాడు.

ఐతే ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ మాత్రం గత నెలలోనే పున:ప్రారంభం అయింది. పవన్ లేని సీన్లను అవగొట్టేసి.. ఆయన కోసం ఎదురు చూస్తోంది చిత్ర బృందం. ఇంకొన్ని రోజుల్లోనే పవన్ షూటింగ్‌కు వస్తాడని అంటున్నారు. కాగా క్రిష్ సైతం పవన్ కళ్యాణ్‌తో సినిమాను పున:ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసి తన చిత్రానికి అందుబాటులోకి రావడానికి ఆలస్యమవుతుందని గ్రహించి.. మధ్యలో పరిమిత బడ్జెట్లో, తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో ఓ సినిమా చేయడానికి క్రిష్ సిద్ధమైన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ గత నెలలోనే ఆరంభమైంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జోరుగా షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రాన్ని నవంబరుకల్లా పూర్తి చేయడానికి క్రిష్ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగాడు. ఆ సినిమా షూటింగ్ అయ్యాక కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ తీసుకుని.. డిసెంబరు మధ్యలో పవన్ సినిమాను పున:ప్రారంభించాలని క్రిష్ టార్గెట్ పెట్టుకున్నాడు.

ఈ విషయాన్ని పవన్‌కు కూడా చెప్పేశాడట. ‘వకీల్ సాబ్’ సినిమాను నవంబరుకల్లా పూర్తి చేసి, డిసెంబరుకు రెడీగా ఉంటే.. షూటింగ్ పున:ప్రారంభిద్దామని.. ఈ మేరకు మిగతా నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు కూడా సర్దుబాటు చేసుకుంటున్నామని పవన్‌కు క్రిష్ చెప్పేశాడట. నిర్మాత రత్నం ఆధ్వర్యంలో అందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మరి క్రిష్ కోరుకున్నట్లు పవన్ డిసెంబరుకల్లా ఈ సినిమా కోసం రెడీగా ఉంటాడో లేదో చూడాలి.