జగన్ ప్రెస్ మీట్ వీడియోలో 3 నిమిషాల ఫీడ్ మిస్?

Jagan pressmeet
Jagan pressmeet

ఒక సీరియస్ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సమయంలో ప్రీరికార్డెడ్ వీడియోను రిలీజ్ చేస్తారా? లేక.. లైవ్ పెడతారా? అంటే.. రెండో ఆప్షన్ కే ఎక్కువ మంది ఓటు వేస్తారు. తాజాగా జగన్ ప్రెస్ మీట్ విషయంలో అందుకు భిన్నంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

మీడియా సమావేశం అంటూనే.. లైవ్ లో కాకుండా.. ఎడిట్ చేసిన వీడియోను రిలీజ్ చేయటం ఏమిటన్నది ప్రశ్న. కరోనా లాంటి హాట్ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు లైవ్ కాకుండా ప్రిరికార్డెడ్ వీడియోను విడుదల చేసిన వైనం జగన్ అండ్ కోను డిఫెన్స్ లో పడేలా చేసింది.

తాను విపక్షంలో ఉన్న వేళ.. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మాట్లాడిన మాటల్లోని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. దాన్ని ఎటకారంగా మార్చేసి సోషల్ మీడియాలో అదే పనిగా వైరల్ చేసిన జగన్.. తానీ రోజున లైవ్ లో మాట్లాడకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారు.

కరోనా ఎపిసోడ్ లో ఇప్పటికే లైవ్ చేసిన ప్రెస్ మీట్లు ఫెయిల్ కావటమే కాదు.. జగన్ పరివారం ఆత్మరక్షణలో పడేలా చేసింది. బ్లీచింగ్.. పారాసిటమాల్ మాట ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీంతో.. లైవ్ ప్రెస్ మీట్లను బంద్ చేసి.. పక్కాగా ఎడిట్ చేసిన వీడియోను మాత్రమే మీడియాకు విడుదల చేస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ విషయానికి వస్తే.. ఇలా ఎడిట్ చేసిన వీడియో నిడివి ఏకంగా మూడు నిమిషాలు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మూడు నిమిషాల నిడివిని ఎందుకు తగ్గించారు? ఆ మూడు నిమిషాల వీడియోలో విషయాలు ఏమున్నాయి? అన్ని తప్పులు మాట్లాడారా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.

జగన్ ప్రసంగ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే మొత్తం వీడియో నిడివి 26 నిమిషాలు ఉండాలి. కానీ.. 23 నిమిషాలు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి చేతి గడియారాన్ని చూపిస్తున్న సమయాల్లోని వ్యత్యాసం ఎడిట్ చేసిన వీడియో నిడివిని చెప్పేసినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న విషయంపై ప్రజలతో లైవ్ లో మాట్లాడకుండా.. ఎడిట్ చేసిన వీడియోను వదిలితే మైలేజీ తర్వాత డ్యామేజీ పక్కాగా చెప్పక తప్పదు. ఇంతకీ ఎడిట్ చేసిన మూడు నిమిషాల ప్రసంగంలోని అంశాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.