ఏపీ కాంగ్రెస్… ఉలుకులేదు, పలుకులేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేనా? మునుప‌టి ప్రాభ‌వంలో పావ‌లా వంతైనా ద‌క్కేనా? ఇదీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌ను వేధిస్తున్న కీల‌క ప్ర‌శ్న‌. ఒక‌ప్పుడు దాదాపు ప్ర‌తి ఇంటిపై ఎగిరిన కాంగ్రెస్ జెండా, అజెండా కూడా.. ఇప్పుడు వీధుల్లోనూ క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఏపీలో పుంజుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్ర‌యోగాలు చేసింది. 2012లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. పార్టీని ముందుకు న‌డిపించే వ్యూహంలో సీమ ప్రాంతానికి పెద్ద‌పీట వేసింది. ర‌ఘువీరారెడ్డిని పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. ఆయ‌న‌తో పార్టీ పుంజుకుంటుంద‌ని అనుకున్నారు.కానీ, అనూహ్యంగా ఉన్న‌వారే వెళ్లిపోయారు.

ర‌ఘువీరా హయాంలో రెండు ఎన్నిక‌లు వ‌స్తే.. ఒక్క‌దానిలోనూ ఆయ‌న స‌త్తా చాట‌లేక పోయారు. దీంతో ఆనంత‌ట ఆయ‌నే త‌ప్పుకొన్నారు. ప్ర‌స్తుతం ఇంటిప‌ట్టునే ఉండి వ్య‌వసాయం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేయ‌లేక పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని అప్ప‌ట్లోనే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును త‌న‌వైపు మ‌ళ్లించుకున్న జ‌గ‌న్‌పై తాను పోరాడ‌లేక పోయాన‌ని, జ‌గ‌న్‌పై పైచేయి సాధిస్తే.. త‌ప్ప‌.. పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి లేద‌ని.. త‌మ‌కు ఎవ‌రైనా శ‌త్రువు ఉంటే.. అది వైసీపీనేన‌ని, టీడీపీ కానీ, మ‌రో పార్టీ కానేకాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇక‌, త‌ర్వాత కాంగ్రెస్ ప‌గ్గాల‌ను మ‌ళ్లీ సీమ ప్రాంతానికే చెందిన నాయ‌కుడు మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్‌కు అప్ప‌గించారు. ఎస్సీ నాయ‌కుడు కూడా కావ‌డంతో పార్టీకి సానుభూతి వ‌స్తుంద‌ని అధిష్టానం భావించి ఉండొచ్చు. అయితే, ఈయ‌న ప‌గ్గాలు చేప‌ట్టి ఆరు మాసాలు గ‌డిచినా.. పార్టీ ప‌రిస్థితి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏ వ్యూహం అమ‌లు చేయ‌లేక తాను విఫ‌ల‌మై.. పార్టీని బ‌తికించుకోలేక పోయాన‌ని ర‌ఘువీరా చెప్పారో.. ఖ‌చ్చితంగా అదే వ్యూహం అమ‌లు చేయ‌డంలో సాకే విఫ‌ల‌మ‌య్యారు. ఇటీవ‌ల పార్టీ సీనియ‌ర్ల స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీ వ్యూహం ఏంటి.. అంటూ.. సీనియ‌ర్ నాయ‌కుడు, ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ ప్ర‌శ్నించిన‌ప్ప‌డు సాకే నీళ్లు న‌మిలార‌ని కొంద‌రు నేత‌లు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు.

వ్యూహం అంటే.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం మాత్ర‌మేనా? అని కూడా సీనియ‌ర్లు చెబుతున్నారు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇత‌ర పార్టీల్లో అవ‌కాశం లేక‌పోవ‌డంతో కొంద‌రైనా పార్టీకి మిగిలార‌ని అంటున్నారు. పైగా సాకే ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గం కోణంలోనే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, పార్టీ స‌భ్య‌త్వాలు పెంచ‌డంపైనా ఆయ‌న దృష్టి పెట్ట‌లేక పోతున్నార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ఘ‌ర్ వాప‌సీ నినాదం ఇచ్చి మూడు మాసాలైనా.. ఇది ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది క‌దా.. అనుకుంటూ.. సాకే అవ‌లంబిస్తున్న సాగ‌తీత ధోర‌ణి స‌రికాద‌ని అంటున్నారు సీనియ‌ర్లు.