వైసీపీ-టీడీపీల్లో ఒక్క‌టే ర‌గ‌డ‌.. ఏజ్ ఫ్యాక్ట‌రే తేడా!!

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల్లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కామ‌నే! మాకు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని కొంద‌రు.. మాకు ద‌క్క‌కుండా చేశార‌ని మ‌రికొంద‌రు.. అస‌లు మా మొహం చూసేవారు ఎవ‌ర‌ని ఇంకొంద‌రు.. ఇలా అసంతృప్తులు, ఆవేద‌న‌లు కోకొల్ల‌లు. అయితే, ఈ రెండు పార్టీల్లోనూ ఇలా ఆవేద‌న‌కు, ఆందోళ‌న‌కు గురవుతున్న‌వారిలో ఏజ్ ఫ్యాక్ట‌రే తేడా క‌నిపిస్తోంది.

అదేంటంటే.. వైసీపీలో సీనియ‌ర్లు.. టీడీపీలో జూనియ‌ర్లు.. త‌మ‌ను ఎద‌గ‌నివ్వ‌డం లేద‌ని, త‌మ‌కు అస‌లు విలువే లేకుండా పోయింద‌ని తీవ్ర స్థాయిలో ర‌గిలిపోతున్నారు. దీంతో పార్టీపై ప్ర‌భావంతోపాటు.. వ్య‌క్తిగ‌తంగా కూడా నాయ‌కుల‌పై ప్ర‌భావం ప‌డుతుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల ఊసు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

వైసీపీ పార్టీలో జూనియ‌ర్ల దూకుడు ఎక్కువ‌గా ఉంది. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేస్తున్నామ‌ని చెబుతున్నా.. లేక‌.. మేం త‌ల‌పండిన నాయ‌కుల‌మ‌ని మొత్తుకుంటున్నా.. సీనియ‌ర్ల‌ను జూనియ‌ర్లు లెక్క‌చేయ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు.. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌, గుర‌జాల‌, విజ‌య‌వాడ తూర్పు, చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు, ఇలా యాభైకి పైగా నియోజ‌క‌వర్గాల్లో.. సీనియ‌ర్ల‌ను జూనియ‌ర్లు లెక్క‌చేయ‌డం లేదట‌. అంతా త‌మ క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాల‌ని, ప‌ద‌వులు, అధికారం అంతా మాకే కావాల‌ని ఇక్క‌డి ఎమ్మెల్యేలు, నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నేత‌లు, పార్టీ అభివృద్ధి కోసం పాటు ప‌డిన నాయ‌కుల‌ను కూడా జూనియ‌ర్లు లెక్క చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అయితే, ఈ విష‌యంలో పార్టీలో భిన్న‌మైన వాద‌నలు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్ల‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌ప్పుకుండా ప్రాధాన్యం ఇస్తామ‌ని, కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌లు యువ నాయ‌క‌త్వానికి జై కొడుతున్నారు.. కాబ‌ట్టి.. వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డంలో త‌ప్పులేద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రు సీనియ‌ర్ల‌ను ఇలా ఒంట‌రి చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. స‌రే.. వైసీపీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. టీడీపీలో దీనికి పూర్తిగా భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ పార్టీలో యువ‌ర‌క్తం నింపుతాన‌ని వారికే 33 శాతం ప‌ద‌వులు ఇస్తాన‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో యువ‌త ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల కొన్ని ప‌ద‌వులు ఇచ్చారు కూడా.

అయిన‌ప్ప‌టికీ.. యువ‌తకు స్వ‌తంత్రం లేకుండా పోయింద‌ని, జూనియ‌ర్ల‌ను మాట్లాడ‌కుండా.. సీనియ‌ర్లు క‌ట్ట‌డి చేస్తున్నార‌ని పార్టీలోయువ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఎక్కువ మంది వార‌సులు నాయ‌కులుగా ఉన్న పార్టీ..టీడీపీ. వీరంతా మున్ముందు పార్టీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తార‌న‌డంలో సందేహంలేదు. కానీ, ఇప్పుడు వీరికి మాట్లాడేందుకు వాయిస్ లేకుండా చేస్తున్నారట సీనియ‌ర్లు.

అంతేకాదు.. పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాను కూడా సీనియ‌ర్లు మేనేజ్ చేస్తున్నార‌ని, దీంతో ఎవ‌రూ కూడా జూనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. బ‌హుశ‌.. ఈ కార‌ణంగానే అయి ఉంటుంది.. ఎప్పుడు చూసినా.. మాట్లాడిన నోళ్లే మాట్లాడ‌తాయి.. సీనియ‌ర్లే మీడియా ముందు క‌నిపిస్తుంటారు.. అంటున్నారు ప‌రిశీల‌కులు. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. వారికి అవ‌కాశాలు కూడా ఇవ్వాల‌నేది వీరి సూచ‌న‌. ఏదేమైనా రెండు పార్టీల్లోనూ చోటు చేసుకున్న రాజ‌కీయాలు చిత్రంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.