అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న బైడెన్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో బైడెన్ పోటి పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ 3వ తేదీన జరగబోయే ఎన్నికలు అమెరికా గతిని సమూలంగా మార్చేస్తాయని చాలామంది నమ్ముతున్నారు. ఇందుకనే ఇద్దరి మధ్య పోటి రసవత్తరంగా సాగుతోంది. ఓదశలో బైడెన్ దెబ్బకు ట్రంప్ చేతులెత్తేసినట్లు కనిపించినా తర్వాత మళ్ళీ పుంజుకున్నారు. అయితే తన వ్యవహార శైలి కారణంగా మళ్ళీ జనాల నమ్మకాన్ని కోల్పోతున్నారు.

ట్రంప్-బైడెన్ మధ్య జరిగిన మొదటి ముఖాముఖి తర్వాత అమెరికాలోని ప్రఖ్యాత దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 30-అక్బోటర్ 1వ తేదీ మధ్య ఇద్దరి వ్యవహార శైలి, సామర్ధ్యాలు, వివిధ అంశాలపై ఇద్దరి వైఖరిపై జర్నల్ అమెరికా మొత్తం మీద సర్వే చేసింది. ఈ సర్వేలో ట్రంప్ కన్నా బైడెన్ కే జనాల మద్దతు ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. అమెరికాకు సంబంధించిన అనేక అంశాలపై ట్రంప్ వ్యవహరించిన తీరుతో పాటు ప్రధానంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో ట్రంప్ అభిప్రాయాలు, చర్యలపై అమెరికా ప్రజలు బాగా మండిపోతున్నట్లు బయటపడింది.

అనేక అంశల్లో ఇద్దరి బలాబలాలపై జరిపిన సర్వేలో బైడెన్ 14 శాతం పాయింట్లతో ట్రంప్ కన్నా ముందున్నట్లు తేలింది. సర్వేలో బైడెన్ విధానాలపైన, వ్యవహార శైలిపైన 53 శాతం మంది మద్దతుగా మాట్లాడారట. మళ్ళీ అధ్యక్షుడిగా ట్రంప్ నే సమర్ధిస్తామన్న వాళ్ళ శాతం 39 శాతం మాత్రమే. ట్రంప్ దూకుడు మనస్తత్వం, విదేశాలతో అమెరికా సంబంధాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమిరకా ప్రజల భద్రత విషయంలో ట్రంప్ నిర్ణయాలతో చాలామంది జనాలు అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో స్పష్టంగా బయటపడింది.

అయితే ట్రంప్ కు కలిసి వచ్చేదేమంటే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులైన వారిలో అత్యధికులకు రెండోసారి కూడా జనాలు అవకాశం ఇచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తయిన రెండుసార్లు మాత్రమే అధ్యక్షునిగా ఉండాలి. అలాగని రెండోసారి అధ్యక్షుడవుతాడని చెప్పేందుకు కూడా లేదు. రెండుసార్లు అధ్యక్షునిగా పనిచేసేందుకు అవకాశం ఉందంతే. మరి ఇదే ఆనవాయితీని జనాలు కంటిన్యు చేసి ట్రంప్ కు ఓట్లేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. ఇదే సమయంలో కరోనా వైరస్ సమస్యతో ట్రంప్ మిలిటరీ ఆసుపత్రిలో చేరటం కూడా కీలక అంశమనే చెప్పాలి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.