అమేజాన్ ఐదు కథలు.. క్లిక్కయ్యేలా ఉన్నాయ్

లాక్ డౌన్ వల్ల మన జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దీని వల్ల చాలా ప్రతికూలతలతో పాటు కొంత మంచి కూడా చోటు చేసుకుంది లాక్ డౌన్ వల్ల. ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే చాలామంది ఇంటి పట్టున ఉండి.. కుటుంబంతో సమయాన్ని గడిపారు. కుటుంబ సభ్యులతో బాండింగ్ పెంచుకున్నారు. దీని వల్ల సంక్షోభంలో ఉన్న బంధాలు కూడా బలపడి ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అయి ఉంటాయి. జీవితాన్ని చూసే కోణం మారి ఉంటుంది. మానవ సంబంధాల్లోని కొత్త కోణాల్ని జనం ఈ సమయంలో చూసి ఉంటారు.

ఈ అంశాల్నే కథా వస్తువులుగా తీసుకుని ఒక ఆసక్తికర వెబ్ సిరీస్ తయారైందిప్పుడు. దాని పేరు.. పుతమ్ పుదు కాలై. అమేజాన్ ప్రైమ్ ఈ సిరీస్‌ను రూపొందించింది. ఈ నెల 16న దీని ప్రిమియర్స్ పడనున్నాయి.

దక్షిణాదిన బాగా పేరున్న టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కలిసి చేసిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో ఐదు కథలు ఉండగా.. ఆ ఐదింటిని గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, రాజీవ్ మీనన్, సుధ కొంగర లాంటి ప్రముఖ దర్శకులతో పాటు సుహాసిని మణిరత్నం డైరెక్ట్ చేయడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్‌లో జయరాం, సుహాసిని, అను హాసన్, శ్రుతి హాసన్, బాబీ సింహా, కళ్యాణి ప్రియదర్శిని, ఆండ్రియా, ఎంఎస్ భాస్కర్ ఊర్వశి లాంటి పేరున్న తారాగణం నటించారు.

లాక్ డౌన్ వల్ల ఒకరంటే ఒకరికి పడని ఓ తాత, మనవరాలు ఒకే ఇంట్లో గడపాల్సి వస్తుంది. అలాగే ఒక యువ జంటకు లాక్ డౌన్ అనుకోని వరంలా కలిసొస్తుంది. ఒక అమ్మాయి బైక్ పాడై ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ లాక్ అయిపోతుంది. అలాగే ఇద్దరు రౌడీలు ఒక ఇంట్లో గడపాల్సి వస్తుంది. మరో కుటుంబం ప్రణాళికలన్నీ దెబ్బ తింటాయి.

ఈ ఐదు కథలు లాక్ డౌన్ వల్ల ఎలాంటి మలుపులు తిరుగుతూ సాగాయనే నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తుంది. పి.సి.శ్రీరామ్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్, గోవింద వసంత లాంటి మంచి సంగీత దర్శకుడు ఈ సిరీస్‌కు పని చేశారు. విజువల్స్ చాలా ఆహ్లాదంగా, హృద్యంగా అనిపిస్తున్నాయి. మంచి ఫీల్ ఉన్న సిరీస్‌లా అనిపిస్తున్న ‘పుతమ్ పుదు కాలై’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలాగే కనిపిస్తోంది.