అక్షయ్ కుమార్.. కర్ర విరక్కుండా, పాము చావకుండా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఆ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి డొంకను కదిలించే ప్రయత్నం చేశారు. దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ సహా చాలామంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మయం అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ రెండుగా విడిపోయింది. కంగనా రనౌత్‌, రవికిషన్ లాంటి వాళ్లు ఇండస్ట్రీ జనాలు డ్రగ్స్‌లో మునిగి తేలుతున్నారని అంటే.. మిగతా జయాబచ్చన్ లాంటి వాళ్లు ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. బాలీవుడ్ బడా బాబులు, డ్రగ్ మాఫియాకు మహారాష్ట్రలోని శివసేన సర్కారు అండగా నిలుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తుంటే.. వాళ్ల మీద విమర్శలు చేసే కంగనా లాంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలుస్తున్న సంగతి స్పష్టం.

ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగాడు. బాలీవుడ్లో డ్రగ్స్ ఆరోపణలపై స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అతను బీజేపీకి పరోక్ష మద్దతుదారు, నరేంద్ర మోడీ ఫాలోవర్ అన్న సంగతి అందరికీ తెలుసు. ప్రభుత్వం తరఫున అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కూడా. మరి అక్షయ్ తన సొంత పరిశ్రమకు మద్దతుగా నిలుస్తాడా లేక కంగనా లాగా యాంటీగా మాట్లాడతాడా అని అంతా ఆసక్తిగా చూశారు. ఐతే అక్షయ్ పాము చావకుండా, కర్ర విరక్కుండా అన్నట్లు మాట్లాడాడు.

‘‘చాలా బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నా. నా అభిప్రాయాలను చెప్పాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా. కానీ సరైన సమయం కాదని అనిపించింది. ఎవరికి, ఎలా, ఏం చెప్పాలో అర్థం కాక ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయా. బాలీవుడ్‌ ఇవాళ ఈ రేంజ్‌లో ఉందంటే అది ప్రేక్షకుల అభిమానం వల్లే. ప్రేక్షకులంతా ఇప్పుడు కోపంగా ఉన్నారంటే.. ఆ కోపాన్ని మేము ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. సుశాంత్‌ మృతి తర్వాత ఏర్పడిన పరిస్థితులతో అందరూ ఎంతగా బాధపడ్డారో, మేమూ అంతే బాధ పడ్డాం. అసలేం జరుగుతోంది అనేలా.. మేమే ఆశ్చర్యపోయేలా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ అంటే అందరూ ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇలాంటి వాటన్నింటిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నా. బాలీవుడ్‌ అంతా క్లీన్‌గా ఉందని అబద్దం చెప్పలేను. అన్ని రంగాల్లో ఉన్నదే ఇక్కడ కూడా ఉంది. అయితే ఒక వ్యవస్థలో కొంత మంది తప్పు చేస్తే.. అది అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. విచారణలో ఏం తేలినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్టే అవుతుందనుకుంటున్నా. కానీఇండస్ట్రీలోని అందరినీ ఓకేలా మాత్రం చూడకండి. అందరినీ దోషులుగా భావించకండి” అని అక్షయ్‌ పేర్కొన్నాడు.