ఎయిర్ ఇండియా 1 వచ్చేసింది

ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది. మనదేశంలోని అత్యంత ప్రముఖులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులకు మాత్రమే వాడేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా మూడు విమానాలను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని తయారు చేసిన బోయింగ్ 777 కంపెనీని మన ప్రభుత్వం సంప్రదించింది. పై ముగ్గురు ప్రముఖుల అవసరాలను గమనించిన బోయింగ్ కంపెనీ అవసరాలకు అనుగుణంగా మూడు విమానాలను తయారు చేసి ఇవ్వటానికి కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టులో భాగంగానే మొదటి విమాననం గురువారం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

నిజానికి ఇపుడొచ్చిన విమానం జూలై మాసంలోనే రావాల్సుంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైంది. ఆగష్టులో వస్తుందని అనుకున్నా సాంకేతిక విషయాలను పరిశీలించే కారణాలతో మరికొన్ని రోజులు ఆలస్యమైంది. సరే అన్నీ పరిశీలనలు పూర్తయిన తర్వాత మొత్తానికి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. బహుశా మొదటి విమానాన్ని రాష్ట్రపతి వాడుతారేమో. పై ముగ్గురిలో ఎవరికీ ఇతరుల వల్ల ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశ్యంతోనే మూడు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలన్నదే కేంద్రప్రభుత్వ ఉద్దేశ్యంగా కనబడుతోంది. మూడు విమానాల కోనుగోలుకు కేంద్రం రూ. 8400 కోట్లు ఖర్చుచేస్తోంది.

భద్రత విషయంలో ఎయిర్ ఇండియా వన్ విమానాలు అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి ఏమాత్రం తీసిపోదు. ఎయిర్ ఇండియా వన్ విమానంలో అత్యంత అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్ధలున్నాయి. శతృవులు ప్రయోగించే క్షిపణలను దారిమళ్ళించే విధంగా అవసరమైన సాంకేతిక డిజైన్లు ఏర్పాట్లున్నాయి. ఈ విమానం ప్రయాణించే మార్గంలో ఎక్కడైనా శతృవుల రాడార్లుంటే పనిచేయకుండా చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఈ విమానం సొంతం.

ఈ విమానాల్లో అత్యంతాధునికమైన కమ్యూనికేషన్, భద్రతాపరమైన రక్షణ వ్యవస్ధ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఉండే ఆడియో, వీడియో కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలో ఎవరితో అయినా సమావేశాలు పెట్టుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు జీఈ 90-115 బీఎల్ ఇంజన్లతో ఈ విమానం ప్రయాణం చేస్తుంది.

గంటకు గరిష్టంగా 559 కిలోమీటర్ల స్పీడుతో ఈ విమానం ప్రయాణం చేస్తుంది. ఒకసారి ఫుల్ ట్యాంకు ఇందనాన్ని నింపితే ఏకదాటిగా 17 గంటలు ప్రయాణం చేయచ్చు. విమానంలో సమావేశాల కోసం భారీ క్యాబిన్లు, మినీ వైద్య కేంద్రం, సమావేశ మందిరం, బెడ్ రూమ్లు, సిబ్బంది కోసం ప్రత్యేకమైన పడకగదులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్ ఇండియా వన్ మొదటి విమనం వచ్చేసింది.