థియేటర్లలో రిలీజయ్యే తొలి సినిమా ఇదేనట

దేశవ్యాప్తంగా ఆరు నెలలకు పైగా మూతపడి ఉన్న థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోబోతున్నాయి. ఈ నెల 15 నుంచి థియేటర్లు రీఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. 50 శాతం సీట్లను మాత్రమే నింపుతూ, కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చని కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎట్టకేలకు థియేటర్లు ఓపెన్ చేయడం సినీ వర్గాలకు సంతోషం కలిగించే విషయమే కానీ.. ఇన్ని షరతులు, భయాల మధ్య సినిమాలు ఏమాత్రం నడుస్తాయో అన్న సందేహాలున్నాయి. అసలు పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్న తరహాలో ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేసే నిర్మాతలు ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఏవో చిన్న సినిమాలు వస్తే రావాలి తప్ప.. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాలు కూడా రెవెన్యూ బాగా తక్కువగా వచ్చే ఈ పరిస్థితుల్లో రిలీజ్‌కు సాహసం చేయకపోవచ్చని అంచనా.

ఇంతకీ అసలు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా థియేటర్లలోకి దిగే సినిమా ఏది అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. దీనికి అత్యవసరంగా సమాధానం ఇచ్చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘కరోనా వైరస్’ సినిమానే కరోనా కాలంలో థియేటర్లలో విడుదల కాబోతున్న తొలి చిత్రమట. ఈ విషయాన్ని వర్మే స్వయంగా వెల్లడించాడు.

లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోకి రానున్న తొలి చిత్రం తమదే అని ఆయన ఘనంగా ప్రకటించేశారు. ఈ సినిమా తెరకెక్కింది కరోనా మీద, అది కూడా కరోనా టైంలో, కరోనా నిబంధనలు పాటిస్తూ కావడం విశేషం. ఆనంద్ చంద్ర అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కరోనా వేళ ఒక కుటుంబంలోని వ్యక్తుల్లో ఒకరిని చూస్తే ఒకరికి పుట్టిన భయం, అనుమానాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే వర్మ సినిమాలంటే పూర్తిగా ఆసక్తి చచ్చిపోయిన ఈ సమయంలో ఆయన సినిమా థియేటర్లలోకి వస్తే జనాలు దాన్ని చూడటానికి ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదే ప్రశ్నార్థకం.