యేలేటి సినిమా అప్‌డేట్ వచ్చింది

17 ఏళ్ల కిందట తెలుగు సినిమా ఒక మూసలో సాగిపోతున్న సమయంలో.. ‘ఐతే’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ‘అమృతం’ సీరియల్‌తో ముందుగా సత్తా చాటుకుని.. ఆ తర్వాత ‘ఐతే’తో సినీ పరిశ్రమలోకి దూసుకొచ్చిన యేలేటి.. ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ప్రయాణం, ‘సాహసం’, ‘మనమంతా’ లాంటి వినూత్న చిత్రాలతో పలకరించాడు. అతడి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం గ్యారెంటీగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే‌లో మాస్టర్ అనిపించుకున్న ఈ దర్శకుడు తన ప్రతిభకు తగ్గ స్థాయిలో విజయాలైతే అందుకోలేదు. చివరగా ‘మనమంతా’ సినిమా తీసిన యేలేటి మరో అవకాశం కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. రకరకాల కాంబినేషన్లు అనుకుంటే ఏదీ వర్కవుట్ కాలేదు. చివరికి నితిన్‌ హీరోగా భవ్య క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమాను గత ఏడాదే మొదలుపెట్టాడు.

ఐతే ఈ సినిమా మొదలైందన్న సమాచారం తప్పితే ఇప్పటిదాకా ఏ అప్ డేట్ లేదు. మరోవైపు నితిన్.. కొత్త కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్లిపోతున్నాడు. దీని గురించి మాత్రం ఏ ఊసూ లేకపోవడం, నితిన్ కూడా దీనిపై మౌనం వహిస్తుండటం ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న సందేహాలు మొదలయ్యాయి. దీనిపై మీడియాలో వార్తలూ వచ్చాయి. ఐతే అవి చూసి స్పందిస్తున్నారో లేక నిజంగానే ముహూర్తం కుదిరిందో కానీ.. ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్ ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు. గురువారం సాయంత్రం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. నితిన్ కూడా దీని గురించి ట్వీట్ చేశాడు. ఈ అప్‌డేట్ నితిన్ ఫ్యాన్స్ కంటే యేలేటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసే ఓ వర్గం ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణకు కూడా హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కథానాయిక.