స్నేహం మిస్ ఫైర్… ఏపీపై కేసీఆర్ ఫైర్

పార్టీ ప‌రంగా రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పాల‌న ప‌రంగా మాత్రం.. ఏపీతో క‌లిసి ముందుకు సాగుతాం.. రాష్ట్ర ప‌రంగా భౌతికంగా విడిపోయినా.. అన్న‌ద‌మ్ముల మాదిరిగా క‌లిసి ఉందాం. మ‌న స‌మ‌స్య‌లల్ల‌.. వేరొక‌రు వేలు పెట్ట‌కుండా చూసుకుందాం – ఇదీ.. తెలంగాణ నాయ‌కుడిగా.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పేమాట‌. మ‌రీ ముఖ్యంగా ఏపీలో ఏ నాయ‌కుడు ప‌గ్గాలు చేప‌డితే.. ఇరు రాష్ట్రాలూ కీచులాట‌లు లేకుండా ముందుకు సాగుతాయ‌ని ఆయ‌న స్వ‌యంగా అభిల‌షించారో.. ఎవ‌రి కోసం అవ‌స‌ర‌మైతే.. ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి కూడా వ‌స్తాన‌ని చెప్పారో.. ఆయ‌నే జ‌గ‌న్‌.

మ‌రి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. తాను కోరుకున్న పార్టీ, తాను కోరుకున్న వ్య‌క్తి.. ఏపీ సీఎంగా ఉన్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంతో ఏమేర‌కు క‌లివిడిగా ఉంటున్నారు? ఏమేర‌కు క‌లిసి ముందుకు సాగుతున్నారు? అని ప‌రిశీలిస్తే.. ఒక అడుగు ముందుకు .. నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో ఏపీకి వ‌చ్చిన కేసీఆర్‌.. రాష్ట్రానికి అన్ని విధాలా అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కూడా రెండు ప‌ర్యాయాలు ఆయ‌న విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు.

అయితే, అలాంటి నాయకుడు ఇప్పుడు క‌స్సుబుస్సులాడుతున్నారు. వ‌చ్చే నెల 6న ఢిల్లీలో అపెక్స్ స‌మావేశం ఉంది. రెండు రాష్ట్రాల జ‌ల వివాద‌ల‌పైనా కేంద్రం పంచాయ‌తీ పెడుతోంది. ఈ భేటీలో తెలంగాణ స‌త్తా తేల్చాల‌ని.. కేసీఆర్ నిర్ణ‌యించ‌డం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. నిజ‌మే .. ఏ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి కాబ‌ట్టి.. చెప్ప‌డాన్ని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ఏపీ తొండాట ఆడుతోంద‌ని.. తెలంగాణ‌తో గిల్లి క‌జ్జాలు పెట్టుకుంటోంద‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌పంచం మొత్తానికి వినిపించేలా.. కేంద్రానికి ఏక‌రువు పెట్టాల‌ని కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీశాయి.

నీళ్ల విష‌యంలో సామ‌ర‌స్య పూర్వ‌కంగా ముందుకు సాగుతాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏపీ విష‌యంలో ఇంత‌గా ఎందుకు ఫైర్ అవుతున్నారు. అమీతుమీకి ఎందుకు సిద్ధంగా ఉన్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న కేసీఆర్‌.. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేట‌ర్ ఎత్తును పెంచ‌డంతో ఏపీతో క‌య్యానికి కాలుదువ్వుతున్నారు. పోనీ.. నీటి విష‌యంలో తెలంగాణ నిబ్బ‌ద్ద‌త పాటిస్తోందా? అంటే.. సాగ‌ర్ జ‌లాల్లో.. వాటాను మించి.. విద్యుత్‌ను తోడేస్తోంద‌ని కేంద్ర‌మే హెచ్చ‌రించింది.

ఇక‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టు అనుమ‌తుల విష‌యంలోనూ కొన్నింటిని కేంద్రాన్ని సంప్ర‌దించ కుండానే చేప‌ట్టార‌ని కూడా కేంద్రం పేర్కొంది. ఏదేమైనా.. జ‌ల వివాదాల విష‌యంలో ఏపీ-తెలంగాణ‌ల బంధం ఎప్ప‌టికీ.. మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెన‌క్కే!!