రామోజీరావుకు ఊరట

కరోనా దెబ్బకు బిగ్ షాట్స్ సైతం కుదేలైపోయారు. ఎన్నో వ్యాపారాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా, చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపే వ్యక్తిగా పేరున్న రామోజీ రావు సైతం కరోనా దెబ్బతో అల్లాడిపోయారు. ఆయనకు స్థిరాస్తులకు లోటు లేదు కానీ.. రామోజీ గ్రూప్ నడిపించే అన్ని వ్యాపారాలపైనా కరోనా ప్రభావం గట్టిగానే పడింది.

ఈ గ్రూప్‌కు మూల స్తంభం, అత్యధిక ఆదాయం తెచ్చేపెట్టే వనరు అయిన ‘ఈనాడు’ సైతం కరోనా ధాటికి వణికింది. ప్రకటనల ఆదాయం దారుణంగా పడిపోయి, సర్క్యులేషన్ తగ్గించుకుని, అనేక రకాలైన కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఉన్నంతలో ఈటీవీ పరిస్థితి పర్వాలేదు. కానీ రామోజీ గ్రూప్‌లోని మిగతా వ్యాపారాలు మాత్రం దారుణంగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఫిలిం సిటీ నుంచి గత ఆరేడు నెలల్లో రూపాయి ఆదాయం రాకపోగా.. దాన్ని మెయింటైన్ చేయడానికి కోట్లు పెట్టాల్సి వచ్చింది.

ఇటు షూటింగులూ లేక, అటు టూరిస్టులూ రాక ఫిలిం సిటీ నిర్వహణ తలకు మించిన భారంగా మారింది రామోజీ రావుకు. మళ్లీ షూటింగ్‌‌లు మొదలైతే అంతా సర్దుకుంటుంది కొన్ని నెలల పాటు ఎదురు చూస్తూ వచ్చారు కానీ.. బాగా ఆలస్యం అయిపోయింది. ఐతే ఎట్టకేలకు ఇప్పుడు ఫిలిం సిటీ మళ్లీ షూటింగ్‌లతో కళకళలాడుతుంది. గత రెండు వారాల్లో ఆర్ఎఫ్‌సీలో చాలా సినిమాల షూటింగ్‌‌లు మొదలయ్యాయి. చూస్తుండగానే ఆర్ఎఫ్‌సీ బిజీ అయిపోయింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్ చేసే అవకాశమే లేదు. సిటీలోని స్టూడియోల్లో అంటే చాలా పరిమితులుంటాయి. ఫిలిం సిటీలో ఎలాంటి వాతావరణాన్నయినా సృష్టించి సన్నివేశాలు తెరకెక్కించవచ్చు. భారీతనంతో కూడుకున్న వాటికి కూడా ఇబ్బంది లేదు.

దీంతో టాలీవుడ్ సినిమా బృందాలన్నీ అటు వైపే చూస్తున్నాయి. ఇక్కడే కొన్ని పర భాషా చిత్రాల షూటింగ్‌కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట. రాబోయే రోజుల్లో వివిధ భాషల చిత్రాలతో ఫిలిం సిటీ కళకళలాడిపోవడం.. లాక్ డౌన్ నష్టాలన్నీ పూడ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది రామోజీరావుకు గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.