`అవతార్-2`పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కామెరూన్

‘అవతార్’…హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని బాక్సాఫీసులను షేక్ చేసిన సినిమా. ఎవెంజర్స్: ఎండ్ గేమ్విడుదలకు ముందు వరకు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎపిక్ మూవీ. ప్రపంచ సినీ చరిత్రలో తనకంటూ చెరగని పేజీని లిఖించికున్న విజువల్ గ్రాండీర్. ఈ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్స్ కోసం సినీ ప్రేక్షకులు, అవతార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా వల్ల ఈ చిత్ర విడుదల 2021 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ కు వాయిదా పడింది. దీంతో, ‘అవతార్ 2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే, ఆ అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ ఇచ్చారు అవతార్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్. ‘అవతార్ 2’ షూటింగ్ పూర్తయ్యిందని, కేవలం విడుదల తేదీ మాత్రమే మారిందని క్లారిటీ ఇచ్చాడీ దిగ్గజ దర్శకుడు.

అంతేకాదు, ‘అవతార్ 3’ చిత్ర షూటింగ్ కూడా 95 శాతం పూర్తయిందని, కేవలం మరో 5 శాతం మిగిలి ఉందని అవతార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు కామెరూన్.అవతార్ షూటింగ్ న్యూజిల్యాండ్ లో జరిగిందని, అందుకే అవతార్-2, అవతార్-3ల షూటింగ్ లను న్యూజిలాండ్ లో జరపాలని చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నానని కామెరూన్ అన్నారు. ఆ నిర్ణయం ఇపుడు తనపాలిట వరంగా మారిందని, కరోనాను విజయవంతంగా కట్టడి చేసిన తొలి దేశం న్యూజిలాండ్ లో తన షూటింగ్ కు ఎటువంటి ఆటంకం కలగలేదని అన్నారు. ఇపుడు న్యూజిల్యాండ్ లో తమ చిత్ర యూనిట్ సాధారణ జీవితం గడుపుతూ షూటింగ్ లు చేసుకుంటోందని చెప్పారు. ప్రపంచంలో అనేక రంగాలతోపాటు సినిమా రంగాన్ని కూడా కరోనా అతలాకుతలం చేసిందని కామెరూన్ అన్నారు.