విశాఖ విచిత్రం – రామురామంటున్నారు ఆ ఇద్దరు !

వినటానికి విచిత్రంగానే ఉన్న పార్టీలోనే ఈ చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద టిడిపి గెలిచింది వైజాగ్ నగరంలో మాత్రమే. నగరంలోని నాలుగు సీట్లనూ తెలుగుదేశంపార్టీ గెలిచింది. అంటే నగరంలో పట్టున్నట్లు తమ్ముళ్ళు నిరూపించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల తర్వాత రాజకీయంగా టిడిపిలో చాలా మార్పులొచ్చేశాయి. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో కూడా పార్టీ నేతల్లో చీలిక వచ్చేసింది. దీని పర్యవసానమే ఈమధ్యనే విశాఖనగరంలోని దక్షణి ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయాడు.

వాసుపల్లి వైసిపిలోకి వెళ్ళిపోయినా లెక్క ప్రకారం ఇంకా ముగ్గురు ఎంఎల్ఏలుండాలి. ఇక్కడే సమస్యలు మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వైజాగ్ ను రాజధాని చేస్తానని జగన్ అంటుంటే చంద్రబాబు వ్యతిరేకించటాన్నే చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకనే జగన్ ప్రకటనను వ్యతిరేకించాలని చంద్రబాబు ఎన్నిసార్లు ఆదేశించినా ఎంఎల్ఏలు, నేతలు పట్టించుకోలేదు.

రాజధాని విషయమై చంద్రబాబు ఎన్నిసార్లు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించినా నగరంలోని నలుగురు ఎంఎల్ఏల్లో తూర్పు ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ తప్ప ఇంకెవరు స్పందించటం లేదు. పైగా మిగిలిన ముగ్గురు అసలు వీడియో కాన్ఫరెన్సులకు కూడా హాజరుకావటం లేదు. ఈ నేపధ్యంలోనే వాసుపల్లి పార్టీని వీడారు. రాజీనామా చేశాను. అనర్హత వేటు వేయించుకోండన్నారు. అంటే ఇక మిగిలింది ముగ్గురు ఎంఎల్ఏలు మాత్రమే. అయితే వాసుపల్లి పార్టీని వదిలేసిన తర్వాత మూడుసార్లు చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సు నిర్వహిస్తే వెలగపూడి తప్ప మిగిలిన ఎంఎల్ఏలు గంటా, గణబాబు హాజరుకాలేదట.

అంటే అధికారికంగా వాసుపల్లి టిడిపికి రాజీనామా చేశారు సరే మరి పై ఇద్దరు ఎంఎల్ఏలు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సులో ఎందుకు పార్టిసిపేట్ చేయటంలేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే విషయాన్ని వాకబు చేయటానికి ఎన్టీయార్ ట్రస్టు భవన్ బాధ్యులు ప్రయత్నం చేసినా ఉపయోగం లేదని సమాచారం. దాంతో టిడిపి తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏల్లో చివరకు మిగిలింది ఒక్క ఎంఎల్ఏ వెలగపూడి మాత్రమే అని పార్టీలోనే చర్చ జరుగుతోంది.