టైమ్స్ 100 లిస్ట్ లో మోదీ & దాదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్న మోడీ….ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. శక్తివంతమైన దేశాధినేతగా, ఎంతోమందిని ప్రభావితం చేసిన దార్శనికుడిగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందారు.

కొద్ది నెలల క్రితం ఎన్నార్సీ, సీఏఏలతో దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించాలని ప్రధాని మోడీ నడుం బిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ ఫీఆర్ లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న బిల్కిస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 82 ఏళ్ల వయసులోనూ నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాల్లో, ధర్నాలో పాల్గొన్న బిల్కిస్….ఎంతోమందిని చైతన్య పరిచింది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అలుపుసొలుపు లేకుండా ఆందోళనలో పాల్గొంది.

సీఏఏ, ఎన్నార్సీల విషయంలో వీరిద్దరూ భిన్న ధృవాలు. కానీ, ఇతరులను ప్రభావితం చేయడంలో మాత్రం వారి వారి స్థాయిల్లో ఎవరికి వారే గొప్పవారు. అందుకే, వీరిద్దరూ 2020 సంవత్సరానికి గాను టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

వీరితో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది టైమ్స్-100 జాబితాలో భారత ప్రధాని మోదీతో షాహీన్ బాగ్ ‘బామ్మ’ (దాదీ) కూడా చోటు దక్కించుకున్నారు. దీంతో, టైమ్స్ తన లీడర్ల కేటగిరీలో మోదీ పేరును చేర్చి, ‘ఐకాన్ల’ కేటగిరీలో బిల్కిస్ పేరును చేర్చింది. ఆర్టిస్ట్ కేటగిరీలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా చోటు దక్కించుకున్నాడు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్,అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీగా పోటీ చేస్తున్న కమలా హారిస్, లండన్ లో పనిచేస్తోన్న భారత సంతతి డాక్టర్ రవీంద్ర గుప్తా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో ఉన్నారు. చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ వంటివారు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.