డేంజర్ జోన్లోకి కొడాలి నాని

మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన నాని.. హిందూ దేవాలయాలకు సంబంధించి ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుమానాస్పద ఘటనల విషయంలో చాలా తేలిగ్గా మాట్లాడేశారు.

అంతర్వేది రథం కాలిపోతే ఏముంది.. కోటి రూపాయలు పెట్టి ప్రభుత్వమే కొత్తది తయారు చేయిస్తుంది.. దేవుడికొచ్చిన నష్టమేంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆంజనేయుడి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే దేవుడికి ఏమవుతుంది.. దాన్ని బాగు చేయిస్తాం అన్నారు. అలాగే ఏ చర్చికీ మసీదుకూ.. మిగతా ఆలయాలకూ లేని డిక్లరేషన్.. తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రం ఎందుకని కూడా ఆయన ప్రశ్న సంధించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలోనే దుమారం రేపాయి.

నాని దూకుడు ఎలాంటిదో.. ఆయన ప్రత్యర్థుల్ని ఎలా తిట్టిపోస్తారో అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు బూతులు, తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. ఐతే ఎక్కువగా ఆయన టార్గెట్ చేసేది మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులనే. వాళ్లను ఎన్ని మాటలన్నా నానీకి చెల్లిపోయింది. రాజకీయ వైరంతో దిగజారి మాట్లాడినా కూడా ఆయనకు వచ్చిన ఇబ్బంది లేకపోయింది. తటస్థంగా ఉండే జనాలకు మంత్రి మాటలు, తీరు ఏమాత్రం రుచించకపోయినా.. చంద్రబాబు అండ్ కో అంటే పడని వాళ్లందరూ ఆ మాటల్ని ఎంజాయ్ చేశారు.

కానీ ఇప్పుడు హిందూ దేవాలయాల విషయంలో చేసిన వ్యాఖ్యలతో నాని తటస్థుల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీకి టార్గెట్‌గా మారిపోయారు. ఒకప్పుడు ఏపీలో ఒక చోట రోడ్డుకు అడ్డంగా ఉందని, విస్తరణ పనుల్లో భాగంగా వైఎస్ విగ్రహం తొలగించబోతే నాని పెద్ద గొడవ చేశారు. అలాంటిది ఇప్పుడు దేవుళ్ల విగ్రహాలు, రథాల విషయంలో ఇంత తేలిగ్గా మాట్లాడ్డం ఏంటని సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే తాజా వ్యాఖ్యలతో నాని డేంజర్ జోన్లోకి వచ్చారని, ఆయన జనాగ్రహం చూడక తప్పదని స్పష్టమవుతోంది.