సినిమా ఇండస్ట్రీలో మగాళ్లకూ సేఫ్టీ లేదు!

కంగన రనౌత్‍ దగ్గర కాంట్రవర్సీకి కంటెంట్‍ అయిపోయిన ప్రతిసారీ ‘ప్రెజెంట్‍ మేడమ్‍’ అంటూ ఎవరో ఒకరు చెయ్యెత్తి ఆమెకు కొత్త కంటెంట్‍ ఇస్తున్నారు. బాలీవుడ్‍లో బంధుప్రీతికి వ్యతిరేకంగా ఆమె గతంలోనే నిరసన తెలిపింది. అది చల్లారిపోయిన తర్వాత మళ్లీ సుషాంత్‍ సింగ్‍ రాజ్‍పుట్‍ మరణంతో ఆమె అదే అంశాన్ని తెరమీదకు తెచ్చింది.

రియా చక్రవర్తి అరెస్ట్తో అది మళ్లీ మరుగున పడిపోతున్న టైమ్‍లో కంగన ఆఫీసుని అక్రమ కట్టడమంటూ కూల్చేయడం ఆమెకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈలోగా జయాబచ్చన్‍, ఊర్మిళ లాంటి వాళ్లు కంగనపై కామెంట్‍ చేసి మరికాస్త పబ్లిసిటీకి దోహదపడ్డారు. తాజాగా పాయల్‍ ఘోష్‍ తనపై బాలీవుడ్‍ దర్శకుడు అనురాగ్‍ కశ్యప్‍ అఘాయిత్యం చేయబోయాడంటూ ఇంటర్వ్యూ ఇవ్వడంతో కంగన ఈ టాపిక్‍ని తన వెపన్‍గా మార్చేసుకుంది.

తనకు ఇండస్ట్రీలో అలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయని, చాలా మంది అగ్ర హీరోలు తనను వ్యాన్‍లో, ఇంట్లో, ఆఫీసులో సెక్సువల్‍గా వేధించారని అంటూనే ఇండస్ట్రీలో ఆడవాళ్లకే కాకుండా మగవాళ్లకు కూడా సేఫ్టీ లేదని, కామవాంఛతో రగిలిపోయే సినిమా వాళ్లు అమాయకులు, బలహీనులయిన కుర్రాళ్లను కూడా సెక్సువల్‍గా హింసిస్తారని ఆమె ఆరోపించింది. బాలీవుడ్‍ ఇండస్ట్రీపై అంతటా విమర్శలు పెల్లుబుకుతోన్న వేళ కంగన ఆ అగ్నిపై ఆజ్యం చల్లుతూనే వుంది. ఆమె చేతికి ఆ నూనెను ఎవరో ఒకరు ఇలా పాయల్ మాదిరిగా అందిస్తూనే వున్నారు.