గురువుకు దేవిశ్రీ భలే ట్రిబ్యూట్ ఇచ్చాడే

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు తన తండ్రి సత్యమూర్తి ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో.. తనకు సంగీతం నేర్పిన గురువు మాండలిన్ శ్రీనివాస్ అన్నా కూడా అదే స్థాయిలో గౌరవ మర్యాదలున్నాయి. ఆయన చనిపోయినపుడు దేవి ఎంతగా బాధ పడ్డాడో తెెలిసిందే. వీలు చిక్కినపుడల్లా తన గురువును గుర్తు చేసుకుంటాడు. ఆయన గురించి గొప్పగా మాట్లాడతాడు. తన వంతుగా గురువుకు నివాళి ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాడు. గతంలో గురు పూజోత్సవం నాడు మాండలిన్ కోసం ఒక పాట కంపోజ్ చేసి రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి తన గురువుకు ట్రిబ్యూట్ ఇచ్చాడు. ఆ క్రమంలో తన చిరకాల కోరికనూ నెరవేర్చుకున్నాడు.

సెప్టెంబరు 19న మాండలిన్ శ్రీనివాస్ వర్ధంతి. ఆయన చనిపోయిన తర్వాతి ఏడాది నుంచి ప్రతిసారీ ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు, దేవిశ్రీ, ఇతర శిష్యులు కలిసి సంగీత కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఐతే ఈసారి కరోనా కారణంగా అలా చేయలేకపోయారు. దీని బదులు మాండలిన్ శ్రీనివాస్ కంపోజ్ చేసిన ఒక ట్రాక్ తీసుకుని.. దానికి దేవిశ్రీ ఆర్కెస్ట్రైజేషన్ చేయడం విశేషం. తాను కంపోజ్ చేసిన ట్యూన్‌ను తన గురువుతో ప్లే చేయించడం లేదా ఆయన కంపోజ్ చేసిన ట్యూన్‌కు తాను పాట పాడాలన్నది తన కోరిక అని.. కానీ శ్రీనివాస్ ఉండగా ఆయన్ని అడిగే ధైర్యం చేయలేకపోయానని.. ఐతే ఆయన కంపోజ్ చేసి పెట్టిన ఒక ట్రాక్ ఉందని తన సోదరుడు మాండలిన్ రాజేష్ చెప్పడంతో ఆయన అనుమతితో దాన్ని తీసుకుని తాను ఆర్కెస్ట్రైజేషన్ చేశానని దేవి వివరించాడు. ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సంగీత ప్రియుల్ని అది విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీనివాస్ స్థాయికి తగ్గట్లే ఉన్న ఆ ట్రాక్‌కు దేవిశ్రీ తనదైన శైలిలో ఆర్కెస్ట్రైజేషన్ చేశాడు.