ఐపీఎల్ ప్రేక్షకులను భలే థ్రిల్ చేశారే..

కరోనా దెబ్బకు దాదాపు నాలుగు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. రెండు నెలల కిందట ధైర్యం చేసి బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో నిర్వహించిన ఇంగ్లాండ్-వెస్టిండీస్ క్రికెట్ సిరీస్‌తో తిరిగి క్రికెట్ ఊపిరి తీసుకుంది. ఐతే కరోనా దెబ్బకు క్రికెట్ మైదానాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అభిమానుల్ని అనుమతించకపోవడంతో స్టాండ్స్ అన్నీ బోసిపోయాయి.

మైదానంలో ఏం జరిగినా హడావుడి లేదు. ఆ సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌‌లన్నీ కూడా నిశ్శబ్దంగా సాగిపోయాయి. దశాబ్దాలుగా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నపుడు అభిమానుల అరుపులకు అలవాటు పడిపోయిన వీక్షకులకు ఈ అనుభవం కొత్తగా అనిపించింది. ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ కలిగింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల సంగతెలా ఉన్నా.. అభిమానుల హంగామాకు పెట్టింది పేరైన ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఇలా నిశ్శబ్దంగా సాగితే ఎలా అన్న ఆలోచనే ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.

కానీ శనివారం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ వీక్షించిన ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్. ఐపీఎల్‌కు కూడా అభిమానుల్ని అనుమతించడం లేదు. ఖాళీ స్టేడియంలోనే జరిగింది తొలి మ్యాచ్‌. కానీ మ్యాచ్ చూస్తున్న వాళ్లకు మాత్రం స్టేడియం నిండిపోయిన ఫీలింగ్ కలిగింది. అక్కడ ఫ్యాన్స్ లేకపోయినా సరే.. వాళ్లు ఉన్న భ్రమ కల్పిస్తూ మ్యాచ్ ఆద్యంతం అరుపులు వినిపించేలా మ్యాజిక్ చేశారు.

గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లోంచి అభిమానుల అరుపులు, శబ్దాలను కట్ చేసి.. ఇక్కడ మ్యాచ్ బ్యాగ్రౌండ్లో వచ్చేలా చేసింది స్టార్ స్పోర్ట్స్. బ్యాట్స్‌మన్ ఫోర్ కొట్టినా.. సిక్సర్ బాదినా.. బౌలర్ వికెట్ తీసినా.. ఇంకేం జరిగినా అభిమానులు గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. దీంతో మైదానంలో అభిమానులు ఉండి హంగామా చేస్తున్నట్లే ఫీలయ్యారు టీవీ వీక్షకులు. వారికైతే ఐపీఎల్ మ్యాచ్‌ చూడటంటో ఎలాంటి తేడా కనిపించలేదు.