ఆ సినిమాను పక్కన పెట్టేసిన కమల్?

కమల్ హాసన్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. 90ల చివర్లో వచ్చిన ఈ చిత్రం సౌత్ ఇండియాలో అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ మొదలు కావడం.. కమలే అందులో హీరోగా నటించడం, శంకరే దర్శకుడు కావడం విశేషమే.

ఐతే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రకటించారో కానీ.. దీనికి ఏదీ కలిసి రావడం లేదు. సినిమా పట్టాలెక్కడంలోనే ఆలస్యం జరిగింది. ఆ తర్వాత షూటింగ్‌కు బ్రేక్ పడుతూ వచ్చింది. గత ఏడాది ‘ఇండియన్-2’ షూటింగ్ స్పాట్లో భారీ క్రేన్ కూడా చిత్ర బృందంలోని ముగ్గురు చనిపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే.

ఈ విషాదం నుంచి కోలుకుని మళ్లీ చిత్రీకరణ మొదలుపెడదాం అనుకునేసరికి కరోనా వచ్చి అడ్డం పడింది. ఆ ప్రమాదానికి సంబంధించి మధ్యలో నిర్మాతలతో హీరో కమల్‌కు విభేదాలు తలెత్తడం, వాటిని పరిష్కరించుకోవడానికి కూడా సమయం పట్టింది.

ఐతే కరోనా భయం తగ్గించుకుని వరుసగా సినిమాల షూటింగ్‌లు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ‘ఇండియన్-2’ను కూడా మళ్లీ పట్టాలెక్కిస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ కమల్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. తన సొంత నిర్మాణ సంస్థలో ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కొత్త చిత్రం అనౌన్స్ చేశాడు.

ఈ సినిమాను ఇంకొన్ని రోజుల్లోనే మొదలుపెట్టేస్తున్నారు. వచ్చే వేసవికి విడుదల అని కూడా ప్రకటించేశారు. శంకర్ సినిమా అంటే భారీతనంతో కూడుకున్నది. కరోనా నేపథ్యంలో సెట్లో 50 మందికి మించి ఉండకూదన్న నిబంధనల్ని ‘ఇండియన్-2’ విషయంలో పాటించడం కష్టం.

అసలే ఇంతకుముందు ప్రమాదం జరిగింది. ఇప్పుడు యూనిట్లో ఎవరైనా కరోనా బారిన పడి ఏమైనా అయితే ఆ పాపం మోయలేమన్న ఉద్దేశంతో పూర్తిగా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ‘ఇండియన్-2’ షూటింగ్ చేయొద్దని నిర్ణయించారట. ఈ లోపు ఖాళీలో కమల్.. లోకేష్ సినిమాను పూర్తి చేస్తున్నాడు.

అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ‘ఇండియన్-2’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాది కూడా ఈ సినిమా విడుదల కాదని స్పష్టమవుతోంది. లోకేష్ సినిమా పూర్తయ్యాక కమల్ కొన్ని నెలల పాటు ఎన్నికల పనిలో బిజీగా ఉంటాడు. ఆ తర్వాత కానీ ‘ఇండియన్-2’ను మొదలు పెట్టే అవకాశం లేదు.