కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు

అక్కడ కేంద్రంలో.. పక్కన తెలంగాణలో కరోనా వ్యాప్తి దిశగా ప్రభుత్వాలు సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షాలు కొంత మేర ప్రభుత్వానికి సహకారం అందిస్తుండగా.. తెలంగాణలో అపోజిషన్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంటుగా ఉంటున్నాయి. ఈ రెండు చోట్లా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడట్లేదు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ కష్ట కాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడతాయి. ప్రభుత్వ పెద్దలేమో ప్రతిపక్షం మీద తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేస్తాయి. ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి.

తమ ప్రచార పిచ్చితో వైకాపా నాయకులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారంటూ తెలుగుదేశం, జనసేన ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమే అనిపించేలా అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఐతే ఈ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ప్రతి దాడి మొదలుపెట్టింది.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై సంచలన ఆరోపణలు చేసింది. ఏపీలో కరోనాను వ్యాప్తి చేసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు స్లీపర్ సెల్స్ లాగా పని చేస్తున్నారంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించడం గమనార్హం. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందని ఆయనన్నారు. కొత్త ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి కారణం టీడీపీనేని అనుమానించే పరిస్థితి ఉందని.. ఆ పార్టీ వాళ్లు ఇందుకోసం స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాజ్‌భవన్‌లో కరోనా వ్యాప్తికి చెన్నై నుంచి వచ్చిన కనగరాజే కారణం అనడం సమంజసమా అని మోపిదేవి ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్‌కు లేఖ రాయడం రాజకీయమేనని.. కిట్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మోపిదేవి స్పష్టం చేశారు.