హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ నుంచి భారత వాణిజ్య రాజ్యధానికి రోజూ వేల మంది వివిధ రకాలుగా ప్రయాణిస్తారు. అత్యంత వేగంగా అక్కడికి చేరుకోవాలంటే విమాన ప్రయాణాన్నే ఆశ్రయించాలి. కానీ విమానంలో వెళ్లినంత వేగంగా హైదరాబాద్ నుంచి ముంబయికి రైల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి? ఇదెలా సాధ్యం అనిపిస్తోందా? కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు అనుకున్నట్లుగా అమలైతే కొన్నేళ్లలో ఇది సాధ్యపడొచ్చు.

ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని మోడీ సర్కారు నిర్ణయించడం విశేషం. దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైళ్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో హైదరాబాద్-ముంబయి మార్గం కూడా ఉండటం విశేషం. ఈ రెండు నగరాల మధ్య 711 కిలోమీటర్ల దూరం బుల్లెట్ ట్రైన్‌ కోసం స్పెషల్ ట్రాక్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో పాటు చెన్నై-మైసూరు (435 కిలోమీటర్లు), ఢిల్లీ-వారణాసి (865), ముంబయి-నాగ్‌పూర్ (753), ఢిల్లీ-అహ్మదాబాద్ (886), ఢిల్లీ-అమృత్‌సర్ (459), వారణాసి-హౌడా (760) మార్గాల్లోనూ బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలన్నది కేంద్రం తాజా ప్రతిపాదన. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.10 లక్షల కోట్లు కావడం విశేషం. ఈ ఏడు కొత్త నడవాలకు సంబంధఇంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేయాలని జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను కేంద్రం ఆదేశించింది.

దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడిపేందుకు ఇప్పటికే కేంద్రం పనులు ప్రారంభించింది. ఈ రెండు నగరాల మద్య 508.17 కిలోమీటర్లు ట్రాక్ నిర్మిస్తున్నారు. 2023 డిసెంబర్లో ఈ రైలును ఆరంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే భూసేకరణ సమస్యలు, కోవిడ్, ఇతర ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.