కేంద్ర ప్రభుత్వంపై హీరో సూర్య ఘాటు విమర్శలు

తమిళనాట సామాజిక స్పృహ బాగా ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. ‘అగరం’ పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వందల మంది పేద విద్యార్థులకు అన్నీ సమకూర్చి చదివిస్తున్నాడు సూర్య. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తినపుడు గళం విప్పడానికి సూర్య వెనుకాడడు. వైద్య విద్యలో ప్రవేశం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల కిందట మొదలుపెట్టిన ‘నీట్’ పరీక్షను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్లలో సూర్య ఒకడు.

ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలోనూ ఈ పరీక్షను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టడం.. అనుకున్నట్లే పరీక్షను పూర్తి చేయడం తెలిసిందే. దీనిపై విద్యార్థులు ఎంతగా మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక తమిళనాట ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో సూర్య కేంద్ర ప్రభుత్వంతో పాటు కోర్టుల తీరును కూడా ప్రశ్నిస్తూ ఘాటైన వ్యాఖ్యలతో ఒక స్టేట్మెంట్ మీడియాకు రిలీజ్ చేశాడు.

‘నీట్’ వాయిదాకు సంబంధించిన పిటిషన్లపై విచారణను న్యాయమూర్తులు కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారని.. మరి విద్యార్థులు మాత్రం ఏ భయం లేకుండా పరీక్షలు రాయాలని ఎలా చెప్పారని సూర్య సూటిగా ప్రశ్నించాడు. ఇక కేంద్ర ప్రభుత్వం తీరుపై సూర్య స్పందిస్తూ.. జనాలు కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో పరీక్షకు హాజరై తమ అర్హతను నిరూపించుకోవాలని అనడం ప్రభుత్వాలు ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించాడు.
క్షేత్ర స్థాయిలో పేద విద్యార్థుల కష్టాలు తెలియని వాళ్లు పైన కూర్చుని విద్యా విధానాలు రూపొందిస్తున్నారని విమర్శించాడు. కొందరు టీవీ చర్చల్లో కూర్చున్న మేధావులు.. విద్యార్థులు రాసిన సూసైడ్ నోట్లలో అక్షర దోషాల్ని వెతికే స్థాయికి వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సూర్య. కేంద్ర నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను సూర్య ‘మను ప్రీతి పరీక్షలు’గా అభివర్ణిస్తూ మోడీ సర్కారు తీరును దుయ్యబట్టాడు. విద్యార్థులకు కింది తరగతుల నుంచే ఈ పరీక్షల శిక్ష మొదలవుతోందని.. కొంచెం పైస్థాయికి వెళ్లేసరికి నీట్ లాంటి ప్రమాదకర పరీక్షలు వారి కోసం ఎదురు చూస్తుంటాయని సూర్య విమర్శించాడు.