‘వైల్డ్ డాగ్’ దర్శకుడి ఫ్లాష్ బ్యాక్ తెలుసా?

అహిసూర్ సాల్మన్.. ఈ పేరు వింటే తెలుగవాడిలాగా అనిపించదు. ఐతే పుట్టింది పెరిగింది తెలుగు గడ్డ మీదే. అతను తెలుగువాడే. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా వాసి అతను. ‘ఊపిరి’ సినిమాతో రచయితగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యక్తి.. ‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లితో కలిసి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చి మరింత పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు అక్కినేని నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఐతే ఈ దర్శకుడు టాలీవుడ్లోకి రాకముందు బాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు పని చేయడం, ఒక హిందీ సినిమాకు దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఈ సంగతి తెలుగు సినీ పరిశ్రమలోనూ చాలామందికి తెలియదు. ప్రేక్షకులకు కూడా దీనిపై అవగాహన లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విశేషాల్ని పంచుకున్నాడు సాల్మన్.

డిగ్రీ పూర్తి చేయగానే పుణెలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ మీడియాలో తాను మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేశాక.. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత మహేష్ భట్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం దక్కించుకున్నానని.. ‘జిస్మ్’ సినిమాతో తన ప్రయాణం మొదలైందని.. చాలా ఏళ్ల పాటు భట్ సంస్థలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ తన కెరీర్ సాగిపోయిందని.. ఐతే ఇలా కంఫర్ట్ జోన్లో ఉంటే కష్టమని భావించి తర్వాత దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టానని సాల్మన్ వెల్లడించాడు. ఆ తర్వాత దిల్ రాజు, నిరంజన్ రెడ్డిల ప్రొడక్షన్లో తెలుగులో ఓ పెద్ద హీరో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం వచ్చిందని.. కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిందని అతను తెలిపాడు.

ఆ తర్వాత ‘ఎ వెడ్నస్ డే’ నిర్మాత అంజుమ్ రిజ్వీకి ఓ కథ చెప్పి మెప్పించి, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలో ఆ సినిమా తీశానని.. అదే ‘జాన్ డే’ అని.. కానీ ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో తన కెరీర్ ప్రమాదంలో పడిందని చెప్పాడు. డబ్బులన్నీ పోయి తాను జీరో అయిపోయానని.. కొన్నేళ్లు భారంగా గడిచాయన.. ఐతే తాను నిస్పృహలో ఉండగా నిరంజన్ రెడ్డి ద్వారా ‘ఊపిరి’ సినిమాకు పని చేసే అవకాశం వచ్చిందని.. అక్కడి నుంచి మళ్లీ తన కెరీర్ ఊపందుకుందని.. తర్వాత ‘మహర్షి’కీ పని చేశానని.. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’తో మళ్లీ దర్శకత్వం చేసే అవకాశం కూడా నిరంజన్ రెడ్డి ద్వారానే వచ్చిందని తెలిపాడు సాల్మన్.