అఖిల్ సరసన మరో మహేష్ హీరోయిన్?

అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఓకే అయింది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లను బాగా డీల్ చేస్తాడని పేరున్న స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అఖిల్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అంతకుమించి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు గురించి ఏ వివరాలూ వెల్లడి కాలేదు. బడ్జెట్ దగ్గర్నుంచి ఈ సినిమా విషయంలో ఏ రకంగానూ రాజీ పడట్లేదని… ఓ స్టార్ హీరోయిన్నే అఖిల్‌కు జోడీగా తీసుకోవాలనుకుంటున్నారని చెప్పుకున్నారు.

ఈ క్రమంలోనే కన్నడ అమ్మాయి రష్మిక మందన్నాను ఈ చిత్రం కోసం సంప్రదించినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలనూ తెర వెనుక నుంచి అఖిల్ మిత్రుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. అఖిల్‌ను చరణ్ తల్లి సురేఖ రెండో కొడుకులాగా చూస్తుందని చిరంజీవి గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన సోదర సమాన స్నేహితుడి కోసం చరణ్ ఈ ప్రాజెక్టును సెట్ చేశాడంటున్నారు.

కాగా అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ మూవీలో అతడి కంటే వయసులో పెద్ద అయినా, ఇమేజ్ పరంగా కూడా పై స్థాయిలో ఉన్న పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆమె దీని కంటే ముందు మహేష్ బాబుతో ‘మహర్షి’లో నటించింది. దాని తర్వాత మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌గా చేసిన రష్మికను అఖిల్ తర్వాతి సినిమాకు కథానాయికగా ఓకే చేస్తే విశేషమే అవుతుంది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఇంకొన్ని రోజుల్లోనే ఆ సినిమాను పూర్తి చేసి సురేందర్ చిత్రాన్ని అఖిల్ మొదలుపెడతాడని సమాచారం. సురేందర్ మిత్రుడు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక సురేందర్ పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించనుండటం విశేషం.