కంగనా వెర్సస్ బీఎంసీ.. రసవత్తరం

ప్రస్తుతం ‘కరోనా’ కంటే కూడా ఇండియాలో ‘కంగనా రనౌత్’ వ్యవహారమే హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా బాలీవుడ్ బడా బాబుల మీద పోరాడుతూ వచ్చిన కంగనా రనౌత్.. ఈ మధ్య మహారాష్ట్ర సర్కారును ఢీకొట్టడం మొదలుపెట్టింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో బాలీవుడ్ మూవీ మాఫియాను ముంబయి పోలీసులు కాపాడుతున్నారని ఆమె ఆరోపణలు చేయడం.. దీనిపై అధికార పార్టీ నుంచి కంగనాకు హెచ్చరికలు జారీ కావడం.. ఈ నేపథ్యంలో ముంబయి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లా మారిందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిన సంగతే.

ఇంతలో కంగనాకు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న కంగనా.. కేంద్రం నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేయించుకున్న తర్వాతే ముంబయికి రావాలని నిర్ణయించుకుంది. ఆ ఏర్పాటు జరిగాక ముంబయిలో బుధవారం అడుగు పెట్టింది.

సరిగ్గా ఆమె వచ్చే సమయానికి బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ కంగనాకు పెద్ద షాక్‌తో రెడీ అయింది. కంగనా కార్యాలయంలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ దాన్ని కూలగొట్టేందుకు రెడీ అయింది బీఎంసీ. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే బుధవారం ఉదయం బీఎంసీ ఆ పనిలో ఉండగానే కంగనా టీం కోర్టును ఆశ్రయించింది. బొంబాయి కోర్టు ఈ కార్యాలయ కూల్చివేతపై స్టే విధించడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

మరోవైపు కంగనా బుధవారం మధ్యాహ్నం ముంబయి ఎయిర్ పోర్టులో అడుగు పెట్టగా.. కేంద్రం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందితో పాటు కంగనా వ్యక్తిగత సహాయకులు కూడా ఆమెకు రక్షణగా నిలిచి బయటికి తీసుకొచ్చారు. ఏ ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఎయిర్‌పోర్టుకు వచ్చారేమో అన్నంత హడావుడి కనిపించింది.

ఎయిర్‌పోర్టు బయటేమో కంగనాకు మద్దతుగా వందల మంది ప్లకార్డులు పట్టి నిలవడం విశేషం. ఈ హంగామా అంతా చూస్తే కంగనా అతి త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతోందని, భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుని శివసేన-కాంగ్రెస్ సర్కారును ఢీకొట్టడం లాంఛనమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.