జ‌గ‌న్ అవాక్కయ్యే మాట చెప్పిన ప‌వ‌న్‌

దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. వీటి విష‌యంలో ఒక‌రికి అనుకూలంగా కొంద‌రికి వ్య‌తిరేకంగా ఉండ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎంత మాత్రం మంచిది కాదు. అయితే, ఏపీలో గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరుగుతున్న ఘ‌ట‌న‌లు కొత్త చ‌ర్చ‌కు తెర‌తీస్తున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం వంటివి వివాదంగా మారాయి. దీనిపై జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల గురించి ఖ‌చ్చితంగా మాట్లాడాల‌ని పేర్కొన్న ప‌వ‌న్ ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే అని ఆరోపించారు. మ‌రే ఇత‌ర ప్రార్ధనా మందిరాలను ఇలా అపవిత్రం చేస్తే అందరూ ఇబ్బంది లేకుండా మాట్లాడుతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిగానీ, హిందూ మతానికి సంబంధించిగానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారు అన్న ఒక భావజాలాన్ని ప్రవేశ పెట్టారు. అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చిందని పేర్క‌న్న ప‌వ‌న్ మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికీ సమానమ‌ని తెలిపారు. “ఏ మతానికి కానీ , ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇచ్చారు. సెక్యులరిజం అంటే అందర్నీ సమానంగా చూడటమే. కొంత మందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా.

ఈ క్రమంలో మెహర్బానీ రాజకీయాలు ఎక్కువైపోయాయి. హిందూ ధర్మాన్ని వెనుకేసుకొస్తే నువ్వు లౌకికవాదివి కాదు అంటారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఖండిస్తే నువ్వు సెక్యులర్ వాదివి కాదు అంటారు. మరే మతం మీద దాడి జరిగినా విగ్రహాలను పాడు చేసినా, ప్రార్ధనా మందిరాలను అపవిత్రం చేసినా… నువ్వు గొంతేసుకుని నిలబడితేనే సెక్యులర్ వాదివి. ఇలాంటి మౌఢ్యంతో కూడిన పడికట్టు భావజాలాలు పెరిగిపోతూ ఉన్నాయి.“ అంటూ అనేక‌మందిలో క‌లుగుతున్న అభిప్రాయాల‌ను ప‌వ‌న్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు.

“ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడిని. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేం. పిఠాపురంలో మొదలయ్యింది. సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఊరది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం అది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసేశారు. అది ఎవరు చేశారు అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. ఆహ…అనుకున్నాం.

నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. నాకేం అర్ధం కాలేదు. ఓహో ఇలా జరుగుతాయా అనుకున్నా. ఇప్పుడు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట.. ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..? ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి.“ అని ప‌వ‌న్ డిమాండ్ చేశౄరు.

నాణాలు విసిరేస్తే ఏడుకొండలవాడి పింక్ డైమండ్ పగిలిపోయింది. ముక్కలు చెల్లాచెదురైపోయాయి. అలాగే స్వామివారి రథాలు కాలిపోతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో పిచ్చివాళ్లు చేసిన పని అని చెబుతుంటే స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. తాము చెబుతున్న కారణాలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. దీని మీద నేను కోరుకునేది ఒకటే. సమగ్ర విచారణ జరపాలి. మీరు చెప్పినట్టు మతిస్థిమితం లేని వాళ్లు అనేది కాకుండా పకడ్బందీ కారణాలతో సాగుతున్నాయా అనే కోణంలో విచారించాలి. అవ‌స‌ర‌మైతే సీబీఐ విచార‌ణ జ‌ర‌గాలి అని ప‌వ‌న్ అన్నారు.