2021లో కేటీఆర్ పట్టాభిషేకానికి భారీ ప్లానింగ్?

తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ లో ఇప్పుడు రెండు అంశాల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందులో ఒకటి జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఒకటి కాగా.. మంత్రి కేటీఆర్ కు పట్టాభిషేకాన్ని ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో.. గులాబీ పార్టీలో కొత్త చర్చ షురూ అయ్యింది.

ఇదెంత ఎక్కువగా ఉందంటే.. పార్టీ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టే ముందు ఎమ్మెల్యేలందరికి చెప్పిన తర్వాతే జరుగుతుందని చెప్పినా.. గ్రౌండ్ వర్క్ జోరుగా సాగుతుందని చెబుతున్నారు. తొలుత వినిపించిన విశ్లేషణలకు భిన్నంగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే అంశంపై కొత్త వాదన వినిపిస్తోంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టే క్రమంలోనే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయటం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. కేటీఆర్ కు పట్టాభిషేకం చేయటానికి గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అర్హతగా చూపించనున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్ని ఈ ఏడాది డిసెంబరుకు మొదలు పెట్టి.. జనవరి మొదటి వారానికి పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నారు.

గ్రేటర్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా.. కేటీఆర్ కు కోట్లాది ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. పట్టాభిషేకానికి ఎలాంటి అడ్డంకులు ఉండవంటున్నారు. సార్వత్రిక ఎన్నికల స్థానే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం.. అదే జరిగితే షెడ్యూల్ కంటే ముందే జరిగే వీలుండటంతో.. వీలైనంత త్వరగా కేటీఆర్ కు పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.