దగ్గుబాటి కొరియన్‍ కనెక్షన్‍

నిర్మాత దగ్గుబాటి సురేష్‍కి కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఆయనకు ఏ కథ అయినా ఒక పట్టాన నచ్చదట. అందుకేనేమో ఆయన ఈమధ్య రీమేక్‍ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర నిర్మాతలు తీసిన సినిమాలు చూసి, నచ్చితే హక్కులు తీసుకుంటున్నారు.

ఓ బేబీ ఓ కొరియన్‍ సినిమాకు రీమేక్‍ అనే సంగతి తెలిసిందే. ఆయన మిడ్‍నైట్‍ రన్నర్స్ అనే మరో కొరియన్‍ సినిమా రీమేక్‍ హక్కులు కూడా తీసుకున్నారు. అందులోని లీడ్‍ క్యారెక్టర్లను స్త్రీ పాత్రలుగా మార్చి దర్శకుడు సుధీర్‍ వర్మ రీమేక్‍ చేయబోతున్నాడు. రెజీనా, నివేదా థామస్‍ అందులో హీరోయిన్లుగా నటిస్తారు. సురేష్‍బాబు తాజాగా డాన్సింగ్‍ క్వీన్‍ అనే మరో కొరియన్‍ సినిమా హక్కులు కూడా తీసుకున్నట్టు సమాచారం.

ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా ఇది. హ్యూమన్‍ ఎమోషన్స్ అవీ మన తెలుగు నేటివిటీకి దగ్గరగా వుంటాయి. ఓ బేబీ మాదిరిగా మన కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మెటీరియల్‍ కనుక సురేష్‍ బాబు దీనిని కొన్నట్టున్నారు. దీనికి లక్ష్యం, సాక్ష్యం ఫేమ్‍ శ్రీవాస్‍ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. సురేష్‍బాబు నిర్మాణంలో వెంకటేష్‍ చేస్తోన్న నారప్ప కూడా రీమేకే కావడం గమనార్హం.