అట్టుడికిన అంతర్వేది…మంత్రులకు చేదు అనుభవం

తూర్పు గోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో అగ్నిప్రమాదం ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చారిత్రక రథం కాలిపోవడం కలచివేసింది. వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న అగ్నికుల క్షత్రియుడు, అలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ నిర్మించిన ఈ రథం ప్రమాదంలో కాలి బూడిద కావడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఉత్సవ రథం కాలిపోయిన ఘటనపై విచారణ జరపాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోపాటు ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై డీఐజీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అంతర్వేదిలో పర్యటించిన మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాల్, విశ్వరూప్ లకు చేదు అనుభవం ఎదురైంది. ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన మంత్రులను హిందూ ధార్మిక సంస్థలు, విహెచ్ ఫీ, భజరంగ్ దళ్ కు చెందిన ఆందోళనకారులు అడ్డుకున్నారు. మంత్రుల వాహనాలపై రాళ్ల దాడిచేయడంతో ఆలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలోనే మంత్రులను అధికారులు సురక్షితంగా ఆలయంలోకి చేర్చారు.

చారిత్రక రథం దగ్ధం కావడంపై హిందూ ధార్మిక సంస్థలు, విహెచ్ ఫీ, భజరంగ్ దళ్ లకు చెందిన ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మలికిపురం సెంటర్ నుంచి అంతర్వేది వరకూ భారీ ర్యాలీని చేపట్టారు. ఈ క్రమంలోనే అంతర్వేదిలో పర్యటిస్తున్న మంత్రులను అడ్డుకున్నారు. దీంతో, అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రథం దగ్ధమైన ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ భక్తులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులకు, భజరంగ్ దళ్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. బారికేడ్లను తోసుకొని ధార్మిక సంఘాలవారు ఆలయం వైపు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.