పీవీకి భారతరత్న తీర్మానం… వ్యతిరేకించిన ఎంఐఎం

తెలంగాణలో మిత్రపక్షాలుగా కొనసాగుతోన్న టీఆర్ఎస్, ఎంఐఎంలపై కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు చాలా సందర్భాల్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఐం అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య గట్టి బంధం ఉందని, అందుకే ఒవైసీపై ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒవైసీ వంతపాడుతుంటారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఆంక్షలు విధించారని, కానీ, మొహర్రం సందర్భంగా జరిగిన భారీ ర్యాలీకి పోలీసులు దగ్గరుండి అనుమతిచ్చారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఒవైసీ వ్యతరేకించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని మిత్రపక్షం ఎంఐఎం వ్యతిరేకించడం ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి సంవత్సరంలో ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న కేసీఆర్ తీర్మానాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం….సభ నుంచి వాకౌట్ కూడా చేయడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

పీవీ నరసింహారావు అసమాన ప్రతిభావంతుడని, విమర్శలకు వెరువని నేత, మహనీయుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రపంచమేధావి, బహుబాషావేత్త, అపరచాణిక్యుడు, ప్రగతిశీలి, సంపన్న భారత నిర్మాత, జాతిరత్నమై భాసిల్లిన నాయకుడు పీవీ అని అసెంబ్లీలో కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. అటువంటి గొప్ప నేతకు మరణానంతరం భారతరత్న ఇచ్చి గౌరవించాలని, పీవీని గౌరవించడం యావత్ భారత జాతి తనను తాను గౌరవించుకోవడం వంటిదని కేసీఆర్ అన్నారు. అందుకే, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోందని కేసీఆర్ అన్నారు. పీవీకి భారత రత్న ఎప్పుడో రావాల్సిందని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పీవీ భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుందని తీర్మానాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీంతోపాటు, పార్లమెంటులో పీవీ విగ్రహం పెట్టాలని,హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని కేసీఆర్ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం అనూహ్యంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో సభ నుంచి ఎంఐఎం వాకౌట్‌ చేసింది. ఆ తర్వాత ఈ తీర్మానాన్నీ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.